మన్సూరాబాద్, ఆగస్టు 7: శ్రీవైష్ణవ సేవా సంఘం, ఎస్వీఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో శ్రీవైష్ణవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు శ్రీవైష్ణవ సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్టీ చారి తెలిపారు. చంద్రపురికాలనీలోని శ్రీవైష్ణవ సేవా సదనంలో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రతి సంవత్సరం చదువుల్లో ఉత్తమ ప్రతిభ చూపిన శ్రీవైష్ణవ విద్యార్థులకు ప్రశంసా పత్రం, నగదు పురస్కారం అందజేస్తామని తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు.
శ్రీ త్రిదండి రామానుజ జీయర్స్వామి, శ్రీవైష్ణవ సేవా సంఘం సలహాదారు కేవీ రమణాచారి, వేణుగోపాలాచారి చేతులమీదుగా ఈ పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. పదో తరగతిలో 10 జీపీఏ సాధించిన విద్యార్థులు ప్రతిభా పురస్కారాల కోసం ఈనెల 31 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మన్సూరాబాద్, చంద్రపురికాలనీలోని శ్రీవైష్ణవ సదనంలో దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. అదేవిధంగా SVS TRUST@ GMAIL. COM లోనూ దరఖాస్తులను పంపవవచ్చని సూచించారు. సమావేశంలో ఎస్వీఎస్ ట్రస్టు అధ్యక్షుడు యాదగిరాచార్యులు, శ్రీవైష్ణవ సేవా సంఘం కార్యదర్శి సేనాపతి మోహన్, కోశాధికారి బద్రీనాథ్, ఉపాధ్యక్షుడు వెంకటాచార్యులు, మాజీ కార్పొరేటర్ నరేంద్ర, సభ్యులు విజయకృష్ణ, యెదు మోహన్, రమాదేవి, మాధవీలత, కిషోర్, జగన్మోహనాచార్యులు, కృష్ణమాచార్యులు, ఆచార్య వేణు తదితరులు పాల్గొన్నారు.