అబిడ్స్, ఆగస్టు 7: అఖిల భారత ఎన్సీసీ మహా నిర్దేశకుల ఆధ్వర్యంలో అన్ని రాష్ర్టాల కెడెట్లు మధ్య న్యూ ఢిల్లీలోని డీజీ ఎన్సీసీలో జరిగిన అంతర్జాతీయ యువ తరంగం ఎంపిక పోటీల్లో అద్భుత ప్రతిభ చూపిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల కెడెట్లను అధికారులు అభినందించారు. కె.కోమలి, కుసుమ, వి.వనజాక్షి, ఎం.శ్రీపూజిత, డి.త్రివేణి, జి.భావన, సుమన్, బి. ఆనంద్, ఆర్. హేమంతకుమార్, ఎన్. శివప్రసాద్, బి. అరవింద్ నాయక్లు అమెరికా, అర్జెంటినా, కిర్గిజిస్తాన్, నైజీరియా, ఫిజీలకు చెందిన కెడెట్లతో అంతర్జాతీయ యువ తరంగం యూత్ ఎక్సేంజ్ ప్రోగ్రాంకు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల్లో భాగంగా ఆగస్టు 12న ఈ కెడెట్లు ఈ ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటింజెంట్ కమాండర్ 28 (ఎ) బీఎన్ ఎన్సీసీ పరిపాలనాధికారి, కర్నూలు లెఫ్టినెంట్ కల్నల్ రాజేశ్ చౌదరి, అసోసియేట్ ఎన్సీసీ అధికారి లెఫ్టినెంట్ జుల్దా విశ్వనాథ్ కుమార్, ఏఎన్వో లెఫ్టినెంట్ బి.హరిణి మీడియా సమావేశంలో తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఎన్సీసీ ఉన్నతాధికారి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎయిర్ కమాండర్ పి.మహేశ్వర్ వీఎం అధికారులను, ఎంపికైన కెడెట్లను అభినందించారు.