పీర్జాదిగూడ, ఆగస్టు 7: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత దిశగా పయనిస్తుంది. స్వచ్ఛ కార్పొరేషన్ తీర్చిదిద్దడంలో భాగంగా చెత్త సేకరణపై మేయర్ జక్క వెంకట్రెడ్డి, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటింటా తడి, పొడి, ప్రమాదకర చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించారు. చెత్తను వేర్వేరుగా సేకరించడానికి ప్రతి ఇంటికి మూడు డబ్బాల చొప్పున పంపిణీ చేశారు. తడి చెత్తతో కంపోస్టు ఎరువు తయారు చేసి మొక్కలకు ఉపయోగించవచ్చని, పొడి చెత్తను రీసైక్లింగ్ ప్రక్రియ ద్వారా తిరిగి ఉపయోగించుకోవచ్చని ప్రజలకు అవగాహన కల్పించారు. కార్పొరేషన్ సిబ్బంది సేకరించిన తడి, పొడి చెత్తను వేరు చేసి షెడ్డులోని కంపార్టుమెంట్లో వేసి దానిని కంపోస్ట్ ఎరువుగా మార్చి హరితహారంలో పెంచుతున్న మొక్కలకు వినియోగిస్తున్నారు. చెత్త సేకరణ వేగవంతం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వేర్వేరుగా వ్యర్థాల సేకరణ..
ఇంటితోపాటు పరిసరాల శుభ్రత కోసం తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా డబ్బాల్లో వేసిన స్థానికుల నుంచి చెత్తసేకరణ చేసి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు.
తడి చెత్త : ఇండ్లలో మిగిలిన శాఖాహార, మాంసాహార పదార్థాలు, కూరగాయల వ్యర్థాలు, పండ్ల తొక్కలు, టీ, కాఫీ పొడి వ్యర్థాలు, ఎండిపోయిన ఆకులు, పూలు, ఇల్లు ఊడ్చిన తర్వాత వచ్చే చెత్త మట్టిలో కలిసిపోయే ఇతర పదార్థాలను సేకరిస్తున్నారు.
పొడి చెత్త : ఇండ్లలో వినియోగించే పిండి, బిస్కెట్ల ప్లాస్టిక్ కవర్లు, చిత్తు కాగితాలు, గాజు సీసాలు, ప్లాస్టిక్ బ్యాగులు పనికి రాని ఇనుము, స్టీలు పరికరాలు తదితర వస్తువులు సేకరిస్తున్నారు. ప్రజలు తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేర్వేరుగా చేసి మున్సిపల్ సిబ్బంది తీసుకువచ్చిన వాహనాల్లో వేస్తుండగా.. సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. చెత్త సేకరణ తెలియని వారికి వార్డుల వారీగా ఏర్పాటు చేసిన వలంటీర్లు అవగాహన కల్పిస్తున్నారు.
పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నాం
ప్రభుత్వం పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నది. నగరపాలక సంస్థ పరిశుభ్రంగా మార్చేందుకు పాలకవర్గంతో కలిసి ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నాం. తడి, పొడి, ప్రమాదకర చెత్తలనువేర్వేరుగా సేకరించాలని అవగాహన కల్పించాం. 26 డివిజన్లకు సంబంధించి చెత్త సేకరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించి ప్రతి డివిజన్కు ఇద్దరు చొప్పున వలంటీర్లను ఏర్పాటు చేశాం. స్వచ్ఛ పీర్జాదిగూడ దిశగా పనిచేస్తున్నాం.
– వెంకట్రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ
ఇంటింటికి మూడు డస్ట్బిన్లు ఇచ్చాం
ఇండ్లలోని వ్యర్ధ పదార్థాలను పట్టణ ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో పడేయకుండామున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మూడు డస్ట్బిన్లను పంపిణీ చేశాం. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరుచేసి అందులో వేస్తున్నారు. తడి, పొడి, హానికరమైన చెత్త సేకరణపై ప్రతి డివిజన్లో ఇంటింటికి అవగాహన కల్పించాం. ప్రజలు మున్సిపల్ కార్పొరేషన్ వాహనంలోనే చెత్తను వేస్తున్నారు.
– కమిషనర్ రామకృష్ణారావు, మున్సిపల్ కార్పొరేషన్