ఘట్కేసర్, ఆగస్టు 7 : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో పోచమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసి, పునర్ నిర్మాణం చేపడుతుందన్నారు.
దాదాపు కోటిన్నర రూపాయల ఖర్చుతో గ్రామంలోని చేపట్టిన ఆలయాల పునర్నిర్మాణంలో భాగంగా, ఎర్ర పోచమ్మ, నల్ల పోచమ్మ, మహంకాళీ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు ఈనెల 1 నుంచి ప్రారంభం అయ్యాయని, చివరి రోజు ఆదివారం ముగింపు ప్రత్యేక ప్రతిష్ఠ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్బంగా మంత్రి చామకూర మల్లారెడ్డి చైర్మన్ బి.కొండల్రెడ్డితో కలిసి ఆలయంలో పూజలు నిర్వహించారు.
కొబ్బరి కాయను కొట్టి తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్రెడ్డి, ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావని జంగయ్య యాదవ్, పోచారం వైస్ చైర్మన్ రెడ్యానాయక్, కౌన్సిలర్లు మహేశ్, ధనలక్ష్మి, రాజశేఖర్, వెంకటేశ్ గౌడ్, బాల్రెడ్డి, సాయిరెడ్డి, ఘట్కేసర్ టీఆర్ఎస్ అధ్యక్షుడు బి.శ్రీనివాస్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.