హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): వర్షాలు, వరదలతో ప్రాణనష్టం జరగకుండా చూడటమే లక్ష్యంగా పనిచేయాలని పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు అధికారులను ఆదేశించారు. హైదరాబాద్తోపాటు ఇతర జిల్లాల్లో వర్షాల ప్రభావితమైన ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించి సహాయ చర్యలను వేగంగా చేపట్టాలని సూచించారు. బుధవారం హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని పలు పట్టణాల పరిస్థితులపై మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వర్షాలు కొనసాగితే చేపట్టాల్సిన ముందు జాగ్రత్త చర్యలపై సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. నిరంతర వర్షాల వల్ల పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్నందున వాటిని తొలిగించాలని సూచించారు. కల్వర్టులు, వం తెనల దగ్గర హెచ్చరిక సూచికలు పెట్టాలన్నారు. స్థానిక పోలీస్, సాగునీరు, విద్యుత్తు, రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకొని హైదరాబాద్ నగరం, పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ, తగ్గింపు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విసృ్తతంగా ఉపయోగించుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సీడీఎంఏను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. పట్టణాలకు దగ్గర్లో ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్లో మున్సి పల్, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు పాల్గొన్నారు.
శిథిల భవనాల్లోని ప్రజలను ఖాళీ చేయించండి
పట్టణాలు, నగరాల్లో శిథిలావస్థలో ఉన్న భవనాల్లో నివాసం ఉంటున్న వారిని అందులో నుంచి వెంటనే ఖాళీచేయించాలని సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీచేశారు. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ సూచనలమేరకు బుధవారం మాసబ్ట్యాంక్ సీడీఎంఏ కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.