సిటీబ్యూరో, జూలై 25 (నమస్తే తెలంగాణ): కువైట్ నుంచి వచ్చిన వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటంతో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఇప్పటికే నగరంలోని ఫీవర్ హాస్పిటల్లో మంకీపాక్స్ చికిత్స కోసం వైద్యాధికారులు ప్రత్యేక ఐసొలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. చికిత్స విధానం, రోగి సంరక్షణ తదితర అంశాలపై వైద్యులు, నర్సింగ్, పారిశుధ్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. కేసులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలో కామారెడ్డి నుంచి వచ్చిన మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తిని ఫీవర్ హాస్పిటల్లోని ప్రత్యేక ఐసొలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ వెల్లడించారు. ప్రస్తుతం అనుమానిత లక్షణాలున్న రోగి మాత్రమే తమ పర్యవేక్షణలో ఉన్నట్లు స్పష్టం చేశారు. అతడి భార్యా, కుటుంబ సభ్యులు, అతడితో సన్నిహితంగా ఉన్నవారిని కామారెడ్డిలోనే వైద్యుల పర్యవేక్షణలో క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు.
ఐదు రకాల నమూనాల సేకరణ..
మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి నుంచి మైనన్ ఆపరేషన్ ద్వారా ఐదు రకాల నమూనాలను సేకరించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ తెలిపారు. ఈ నమూనాలను ప్రత్యేక పద్ధతుల్లో ప్యాక్ చేసి నిర్ధారణ పరీక్షల కోసం పుణెలోని వైరాలజీ ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. మంగళవారం రాత్రి వరకు ఫలితాలు రావచ్చని చెప్పారు. తొలికేసు కావడంతో నమూనాలను గాంధీకి కాకుండా పుణెకు పంపినట్లు వివరించారు.
గాంధీకి చేరిన మంకీపాక్స్ కిట్లు
దేశంలో కలకలం సృష్టిస్తున్న మంకీపాక్స్కు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు చేసేందుకు అవసరమైన కిట్స్ కేంద్రం నుంచి గాంధీ దవాఖానకు చేరుకున్నాయి. ఒక్కో కిట్ ద్వారా 100 మంది అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు చేయవచ్చని వైద్యాధికారులు తెలిపారు. కరోనా నిర్ధారణ పరీక్షల మాదిరిగానే గాంధీ మైక్రోబయోలజీ విభాగంలో ఉన్న వైరాలజీ ల్యాబ్లో ఆర్టీపీసీఆర్ పద్ధతిలో మంకీపాక్స్ పరీక్షలు చేయనున్నట్లు వైద్య అధికారులు తెలిపారు. ప్రస్తుతం ట్రయల్స్లో ఉన్నామని, అనుమానిత కేసులు వస్తే రెండు మూడు రోజుల్లో మంకీపాక్స్ నిర్ధారణ పరీక్షలను ప్రారంభించనున్నట్లు గాంధీ అధికారులు తెలిపారు.
ఆందోళన అవసరం లేదు..జాగ్రత్తలు పాటించండి
ఫీవర్ హాస్పిటల్లో ప్రస్తుతం కువైట్ నుంచి వచ్చిన 35 ఏండ్ల ఒక వ్యక్తికి చికిత్స అందిస్తున్నాం. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. జ్వరం అదుపులోకి వచ్చింది. రోగికి ఉన్నవి అనుమానిత లక్షణాలే. పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత అది మంకీపాక్సా.. కాదా.. అనేది తెలుస్తుంది. రోగితో సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు, ఇతరులు కామారెడ్డిలోనే క్వారంటైన్లో ఉన్నారు. ప్రజలు ఎలాంటి అపోహలు, భయాందోళనలకు గురికావాల్సిన పనిలేదు. మంకీపాక్స్ వల్ల పెద్దగా ప్రాణనష్టం ఉండదు. కానీ, వ్యాప్తి రేటు ఉంటుంది. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చిన, వస్తున్న వారు ఒక వారం పదిరోజులు స్వీయ క్వారంటైన్లో ఉండటం మంచిది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను తరచూ శానిటైజ్ చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.
– డాక్టర్ శంకర్, సూపరింటెండెంట్, ఫీవర్ హాస్పిటల్