తెలుగుయూనివర్సిటీ, జూన్ 28 : భారత సనాతన సంస్కృతి, ధర్మాన్ని నిలబెట్టడానికి సంస్కృతాంధ్రభాషలలో శతావధానం చేయడం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి ప్రశంసించారు. న్యూయార్క్లో ఏరోస్పేస్ విద్యను అభ్యసిస్తున్న లలితాదిత్య అవధానం చేసి అందర్నీ మెప్పించారని పేర్కొన్నారు. ‘దర్శనమ్’ ఆధ్యాత్మిక వార్తా మాసపత్రిక ఆధ్వర్యంలో అబిడ్స్ తిలక్రోడ్డులోని తెలంగాణ సారస్వత పరిషత్తులో అమెరికాలో నివాసముంటున్న తెలుగుతేజం శతావధాన శరత్చంద్ర, కాలకంఠ గన్నవరం లలితాదిత్య శతావధానం కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఈ వేదికకు కోలాచల మల్లినాథ వేదికగా నామకరణం చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో కేవీ రమణాచారి ప్రసంగిస్తూ..వేయిమంది పండితులలో ఒక్క కవీశ్వరుడు ఉంటాడని, అలాంటి కవీశ్వరుల్లో నూటికి ఒక్కరు అవధానిగా ఉంటాడన్న తిరుపతి వేంకటకవుల పద్యాన్ని ఈ సందర్భంగా గుర్తుచేస్తూ అవధాని లలితాదిత్య గొప్పదనాన్ని వివరించారు. పద్మశ్రీ గరికపాటి నరసింహారావు మాట్లాడుతూ ఎంత గొప్ప పండితుడైనా పాండిత్యధారణతోపాటు ధైర్యం ఉంటేనే అవధానం చేసి మెప్పించవచ్చన్నారు. అష్టావధానం కష్టమని, శతావధానం మరీ కష్టమని, సహస్రావధానం అపూర్వమని వివరించారు. నేటి క్రీడలు అవధానం ముందు తీసికట్టేనంటూ ఇదొక యుద్ధం వంటిదేనని..విమర్శలకు, ప్రశంసలకు అవధాని లొంగిపోరాదని తనదైన శైలిలో ఉద్బోధించారు. నటుడు,రచయిత తనికెళ్ల భరణి లలితాదిత్యను సత్కరించి ఆయన పాండిత్యాన్ని వివరించారు. తెలుగుభాష, సాహిత్యం ఉజ్వలంగా ముందుకు సాగుతున్నదని వెల్లడించారు.
కోలాహలంగా అవధానం
తెలంగాణ గురుకులాల విశ్రాంత ప్రధానాచార్యులు మరుమాముల దత్తాత్రేయశర్మ సమన్వయంలో ప్రారంభమైన శతావధాన సభలో గంటి నగేశ్ శంఖనాదం వినిపించగా శతావధాని డాక్టర్ జీఎం రామశర్మ అధ్యక్షతన శతావధాన సంచాలకులు శ్రీరంగాచార్య, శతావధాని ఆముదాల మురళి, దర్శనమ్ పత్రిక ప్రధాన సంపాదకులు ఎంవీఆర్ శర్మ విసిరిన పలు ప్రశ్నలకు లలితాదిత్య సమాధానాలిచ్చారు. మధ్యాహ్నం శతావధాని ఐతగోని వేంకటేశ్వర్లు సంధించిన 12 దత్తపదులకు రెండు పాదాలు, 24 వర్ణనాంశాలలో ఒక పాదం, 5 అశువులను అవధాని లలితాదిత్య పూరించి తెలుగు సాహితీరసజ్ఞులకు సరికొత్త అనుభూతి పంచారు.