సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : దేశ వ్యాప్తంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ వంటి ట్రెండింగ్ కోర్సుల హవా కొనసాగుతున్నది. గత ఏడాది వరకు కేవలం కొన్ని కాలేజీలలో మాత్రమే ఈ కోర్సులు కొనసాగాయి. జేఎన్టీయూ, ఓయూ పరిధిలో ఉన్న దాదాపు 30 నుంచి 40 రకాల ఇంజినీరింగ్ కాలేజీలలో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. గత ఏడాది నుంచి కేవలం కొన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో మాత్రమే కొత్త కోర్సులను డిప్లొమా కోర్సులుగా ప్రవేశ పెట్టారు. ఈ ఏడాది నుంచి ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీలలో కూడా ఈ ట్రెండింగ్ కోర్సులు ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయని, అందుకు సంబంధించి ప్రైవేటు కాలేజీలు ముందుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కొనసాగింపుగా ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంటెక్ వంటి పీజీ కోర్సులలో కూడా కొత్త కోర్సులు ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా వచ్చిన ప్రైవేటు యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూ, ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీలు, వాటి అనుబంధ కాలేజీలలో కూడా కొత్త కోర్సులు అందించడానికి ముందుకు వచ్చినట్లు అధికారులు తెలుపుతున్నారు.
తప్పనిసరి ప్లేస్మెంట్..
మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులకు ఏఐసీటీఈ అనుమతించింది. ఈ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సాఫ్ట్వేర్ రంగంలో విస్తృత స్థాయిలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పైగా బీటెక్ స్థాయిలో అన్ని కాలేజీలలో ట్రెండింగ్ కోర్సులు ప్రవేశ పెడుతుండడంతో.. టీచింగ్ రంగంలో కూడా ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, అందువల్లే ఎంటెక్ పీజీ కోర్సులలో కూడా కొత్త కోర్సులను ప్రవేశ పెట్టడానికి యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటున్నట్లు సీనియర్ ప్రొఫెసర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ ఏడాది నుంచి ఎంటెక్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు వేల వరకు ట్రెండింగ్ కోర్సులలో సీట్లు అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే బీటెక్ పూర్తి చేసిన వారు పీజీలో ట్రెండింగ్ కోర్సులు చేయాలనుకున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఏఐసీటీఈ ఈ మేరకు అనుమతిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు అభిప్రాయపడుతున్నారు.