సిటీబ్యూరో, జూన్ 26(నమస్తే తెలంగాణ): సైబర్ మోసగాళ్లు పోలీసులకు అడుగడుగునా చిక్కుముళ్లు స్పష్టిస్తున్నారు. వాటిని ఛేదించుకొని.. నేరస్తుల వద్దకు చేరాలంటే.. పోలీసులు కనీసం ఆరు రాష్ర్టాల్లో సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో సైబర్ మోసాల ఫిర్యాదులపై దర్యాప్తు చేస్తున్న అధికారులు అనేక ప్రయాసాలు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రధాన సూత్రధారులు దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఇటీవల పదుల సంఖ్యలో కేసులను దర్యాప్తు చేస్తున్న సైబర్ క్రైం పోలీసులు సైబర్ మోసగాళ్ల సరికొత్త ఎత్తుగడలను గుర్తించారు. వారికి దీటుగా దర్యాప్తు పంథాను మార్చి..నేరస్తుల ఆటకట్టిస్తున్నారు.
ఆరు రాష్ర్టాలకు లింక్..
సైబర్ నేరగాళ్లు తమ మోసానికి సంబంధించిన ప్రక్రియలో సిమ్కార్డులను పశ్చిమబెంగాల్, బ్యాంక్ ఖాతాలను జార్ఖండ్, మెయిల్ ఐడీలను రాజస్థాన్, మొబైల్ ఫోన్లను ఉత్తరాఖండ్, కాలింగ్ లొకేషన్ కోసం బీహర్ ఇలా వివిధ రాష్ర్టాలను తిరుగుతూ.. పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు. వారి గ్రామానికి చెందిన వారు ఎవరెవరూ ఏ ఏ రాష్ర్టాల్లో ఉన్నారో తెలుసుకొని.. వారిని సంప్రదించి..సాయం చేసేవారికి మోసాలతో వచ్చే ఆదాయంలో కమీషన్లను పంపిస్తున్నారు.
కమీషన్ శాతం పెంచేశారు..
ఇప్పటి వరకు సైబర్ నేరగాళ్లు ఏజెంట్లకు 40 శాతం పంచి 60 శాతం వారు తీసుకునే వారు. తాజాగా వారు చిక్కకుండా ఏర్పాటు చేసుకున్న పద్మవ్యూహంలో ఏజెంట్లు పెరగడంతో వారు 40 శాతం తీసుకొని.. 60 శాతాన్ని పంచేస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో పలు కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు వెళ్లినప్పుడు పోలీసు అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తమ రూటును మార్చి రివర్స్ ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ చేపట్టారు. వివిధ అంశాలపై దర్యాప్తు చేపట్టి.. మూలాలను కనుగొని.. సైబర్ మోసగాళ్లను అరెస్టు చేస్తున్నారు.
ఆన్లైన్లో..అండర్వేర్ తెప్పించి..
రూ. 1.53 లక్షలు పోగొట్టుకున్న టెక్కీ
ఆన్లైన్ వెబ్సైట్లో అండర్ వేర్ కొనుగోలు చేసిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్…సైబర్ మోసగాళ్లు వేసిన ఎరకు చిక్కాడు. కారు బహుమతంటే.. ఆశపడి..డబ్బులు పోగొట్టుకున్నాడు. మియాపూర్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్(31) ఇటీవల ఓ పేరొందిన ఆన్లైన్ వెబ్సైట్లో రూ.479 పెట్టి కట్డ్రాయర్ను కొనుగోలు చేశాడు. మరుసటి రోజు అజ్ఞాత వ్యక్తి తాను స్నాప్డీల్ నుంచి మాట్లాడుతున్నానంటూ.. మీ ఫోన్ నంబర్.. లక్కీడ్రాలో రూ.12.60 లక్షలు విలువ చేసే సఫారీ కారును గెల్చుకున్నట్లు చెప్పాడు. బహుమతి కావాలంటే వాట్సాప్లో పంపిన లింక్లో పాన్, ఆధార్ కార్డులతో పాటు ఇతర వివరాలను పంపాలని సూచించాడు. ఆశపడిన బాధితుడు అతడు చెప్పినట్లే చేయడంతో పాటు తనకు కారు వద్దని నగదు కావాలని అడిగాడు. అయితే మీరు రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు ఇతర చెల్లింపులు చేస్తే నగదును పంపిస్తామని చెప్పి.. అకౌంట్ నుంచి రూ.1.53 లక్షలు కొట్టేశాడు. లబోదిబోమంటూ బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.