ఖైరతాబాద్, జూన్ 26: ఇండియన్ ప్రాస్తోడాంటిక్ సొసైటీ స్వర్ణోత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఆదివారం స్మైల్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ను సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి. రంగరాజన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జంగాల హరి, ప్రెసిడెంట్ ఎలెక్ట్ డాక్టర్ చేతన్ హెగ్డేతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండియన్ ప్రాస్తోడాంటిక్ సొసైటీ ఏర్పడి 50 ఏండ్లు పూర్తి చేసుకున్నదని, ఈ సందర్భంగా ఓ క్యూర్ కోడ్ను అందుబాటులోకి తీసుకువచ్చామని, సామాన్యులు దీనిని స్కాన్ చేస్తే తమ సమీపం ప్రాస్తోడాంటిక్స్ వైద్యులకు సంబంధించిన సమాచారం లభిస్తుందన్నారు.
పాండిచ్చేరిలో కాగడాతో అసోసియేషన్ సభ్యులు వాక్ను ప్రారంభించారని, తమిళనాడు మీదుగా తెలంగాణకు వచ్చిందని, తర్వాత గుజరాత్కు వెళ్తుందన్నారు. డెంటల్ సర్జరీ పూర్తి చేసిన తర్వాత మూడేండ్ల సూపర్ స్పెషాలిటీ కోర్సు ప్రాస్తోడాంటిక్స్ అని, పండ్లు లేని వారికి కృత్రిమ పండ్లు, ఇంప్లాంట్, పండ్ల సెట్టు తదితర వాటిని రూపొందిస్తారన్నారు. దేశ వ్యాప్తంగా 14 వేలు, తెలంగాణలో 400, హైదరాబాద్లోనే 170 మంది ప్రాస్తోడాంటిక్స్ వైద్య సేవలందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ప్రతినిధులు డాక్టర్ అక్షయ భార్గవ, డాక్టర్ మహేంద్రనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.