మియాపూర్ , జూన్ 24: వినాయక నవరాత్రి ఉత్సవాలకు మట్టి వినాయక ప్రతిమల వినియోగంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్న శేరిలింగంపల్లి జోనల్ అధికారులు, తయారీ దారులను ప్రోత్సహించే విషయంలో మరో అడుగు ముందుకు వేశారు. తయారీకి ఆసక్తిగా ముందుకువచ్చే వారికి రుణ వసతిని కల్పిస్తామని ప్రకటించిన అధికారులు ఆ దిశగా తొలి రుణాన్ని అందించబోతున్నారు. అది కూడా బ్యాంకు నుంచి కాకుండా టీఎల్ఎఫ్ కార్పస్ ఫండ్ ద్వారా షార్ట్ టర్మ్ రుణ వసతి కల్పిస్తున్నారు. శేరిలింగంపల్లి సర్కిల్ నల్లగండ్ల ప్రాంతానికి చెందిన అఖిల పొదుపు సంఘానికి చెందిన సభ్యురాలు హైమావతి మొట్టమొదటగా రూ.లక్ష రుణాన్ని ఈ నెలాఖరున అందుకోబోతున్నారు.
షార్ట్ టర్మ్ లోన్ కింద..
ప్రధానంగా మట్టి వినాయక ప్రతిమల తయారీకి ఆసక్తిగా ముందుకొచ్చిన హైమావతి తనకు రుణ వసతిని కల్పించాలని అధికారులను అభ్యర్థించింది. దీనిపై సంబంధిత అధికారులతో సమీక్షించిన జోనల్ కమిషనర్ శంకరయ్య పొదుపు సంఘాల నగదులో నుంచి ఈ మొత్తాన్ని షార్ట్ టర్మ్ లోన్ కింద అందించాలని సూచించారు. దీంతో టౌన్ లెవెల్ ఫెడరేషన్ (టీఎల్ఎఫ్) కార్పస్ ఫండ్ నుంచి రూ.లక్ష రుణంగా అందించేందుకు సర్కిల్ పీవో మాన్య తగు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీఎల్ఎఫ్ ఆమోదంతో ఈ నెలాఖరున ఈ మొత్తాన్ని జడ్సీ చేతుల మీదుగా సదరు పొదుపు మహిళలకు అందించనున్నారు. ఈ పొదుపు డబ్బుల ద్వారా సుమారు 2 వేల మట్టి వినాయక ప్రతిమలను తయారు చేస్తానని హైమావతి పేర్కొన్నారు.
మొదటిసారిగా మట్టి ప్రతిమల తయారీకి రుణం
మట్టి వినాయక ప్రతిమల తయారీకి షార్ట్ టర్మ్ లోన్ అందించబోతున్న తొలి జోన్గా శేరిలింగంపల్లి బల్దియా నిలిచింది. కాగా అఖిల పొదుపు సంఘంలో గడిచిన పది సంవత్సరాలుగా హైమావతి పొదుపు సభ్యురాలిగా ఉంటూ వస్తున్నది. అయితే ఇప్పటి వరకు బృందాలకు మాత్రమే రుణ సౌకర్యాన్ని కల్పించిన అధికారులు తొలి సారిగా మట్టి వినాయక ప్రతిమల తయారీకి పొదుపు మహిళలను ప్రోత్సహించేందుకు వ్యక్తి గతంగా రూ.లక్ష రుణ వసతిని కల్పించబోతున్నారు. రుణ వసతిని పొందనున్న హైమావతి గడిచిన కొద్ది సంవత్సరాలుగా కుండల తయారీ చేస్తుండగా.. రెండేండ్లుగా మట్టి వినాయక ప్రతిమలను రూపొందిస్తున్నది. ప్రతి ఏడాది తన సొంత నిధులను వెచ్చిస్తుండగా ఈ సారి మాత్రం పొదుపు సంఘం రుణ వసతితో పెద్ద సంఖ్యలో ప్రతిమలను తయారు చేయనున్నది. అయితే ప్రతిమలకు తగిన మార్కెటింగ్ వసతిని కల్పిస్తున్నట్లు సర్కిల్ పీవో మాన్వి, టీఎల్ఎఫ్ అధ్యక్షురాలు వీణ పేర్కొన్నారు.
పొదుపు మహిళకు రుణం ఇస్తున్నాం
పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించేలా అవగాహన కల్పిస్తున్నాం. మట్టి ప్రతిమల తయారీకి పొదుపు మహిళలు ముందుకు రావాలనే ఉద్దేశంతో రుణ వసతిని కల్పిస్తున్నాం. అఖిల పొదుపు సంఘం సభ్యురాలైన హైమావతి మట్టి ప్రతిమల తయారీకి ముందుకు రాగా.. టీఎల్ఎఫ్ ఆమోదంతో ఈ నెలాఖరున రూ.లక్ష రుణంగా అందించనున్నాం. పండుగ ముగిసిన అనంతరం తిరిగి రుణ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది.
– శంకరయ్య, జడ్సీ, శేరిలింగంపల్లి జోన్