బండ్లగూడ,జూన్ 24: వివిధ రాష్ర్టాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఇద్దరు దొంగలను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. రాజేంద్రనగర్ ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ జగదీశ్వర్రెడ్డి వివరాలను వెల్లడించారు. యూపీలోని బారెల్లికి చెందిన వసీమ్, మహ్మద్ షరీఫ్, ఢిల్లీకి చెందిన నసీమ్, జూబేర్ స్నేహితులు. వీరు పలు వ్యాపారులు చేసి నష్ట పోయారు. డబ్బులు సంపాదించాలన్న లక్ష్యంతో దొంగతనాల బాటపట్టారు. ఇందుకోసం వారు ఒక పిస్టోల్, మూడు వాకీటాకీ, పలు ఆయుధాలను కొనుగోలు చేశారు.
అనంతరం వారు గత నెలలో మధ్యప్రదేశ్లోని భోపాల్, బెర్లీలో దొంగతనం చేసి అక్కడి నుంచి పారిపోయి హైదరాబాద్ మైలార్దేవ్పల్లికి వచ్చారు. శాస్త్రీపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఈనెల మొదటి వారంలో విజయవాడలో దొంగతనం చేశారు. ఆ తర్వాత 17వ తేదీన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజాగూడలో దొంగతనం చేసి రూ.3.30 లక్షలతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. ఇదిలాఉండగా.. మధ్యప్రదేశ్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించారు. వారు హైదరాబాద్లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు.
అక్కడి పోలీసులు మైలార్దేవ్పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇన్స్పెక్టర్ నరసింహ, డీఐ రాజేందర్గౌడ్ ఆధ్వర్యంలో వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. గురువారం రాత్రి వారు నివాసం ఉంటున్న ఇంటిని గుర్తించి మహ్మద్ షరీఫ్, నసీమ్ను అదుపులోకి తీసుకున్నారు. వాసీం, జూబేర్ తప్పించుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని విచారించగా.. చేసిన నేరాలను అంగీకరించారు. దీంతో వారిద్దరిని అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించారు. వారివద్దనుంచి రూ. 4.70 లక్షల నగదు, పిస్టోల్, వాకీటాకీతో పాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
నంబర్ ప్లేట్లు మారుస్తూ..
పోలీసులకు చిక్కకుండా నేరగాళ్లు తెలివిగా వ్యవహరించారు. వారు సంచరిస్తున్న వాహనం నంబర్ ప్లేట్ను ఆయా రాష్ర్టాలకు అనుగుణంగా మార్చుకుంటూ సంచరించారు. వారి వద్ద నుంచి పోలీసులు పలు నంబర్ ప్లేట్లను స్వాధీనం చేసుకున్నారు.