కార్పొరేట్ స్థాయిలో ఉచిత విద్యాబోధన.. పాఠ్యపుస్తకాలు.. మధ్యాహ్న భోజనం.. చక్కటి మౌలిక వసతులు..ఆహ్లాదకరమైన వాతావరణం.. ఇంతటి మంచి అవకాశాలను ఎవరైనా వదులుకుంటారా.. అందుకే తమ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు బడిబాట కార్యక్రమం ద్వారా ఉపాధ్యాయుల బృందం విద్యార్థులకు అందించే సౌకర్యాలను వివరిస్తుండడంతో అధిక ఫీజుల మోతతో బెంబేలెత్తిస్తున్న ‘ప్రైవేటు’ వద్దంటూ.. తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లకే జై కొడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియం చదువులు కూడా మొదలుకావడంతో అంచనాలకు మించి అడ్మిషన్లు వస్తున్నాయి. ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో 505 పాఠశాలలు ఉండగా, ఇప్పటివరకు 13,975 ప్రవేశాలు రావడం విశేషమైతే.. అందులో ప్రైవేటు పాఠశాలల నుంచే 981 మంది విద్యార్థులు చేరడం గమనార్హం.
మేడ్చల్, జూన్ 24(నమస్తే తెలంగాణ): ప్రభుత్వ బడుల్లో రికార్డు స్థాయిలో అడ్మిషన్లు జరుగుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిష్ మీడియంతో పాటు ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమంలో భాగంగా మౌలిక సదుపాయలను కల్పిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు బడిబాట కార్యక్రమం ద్వారా పిల్లల తల్లిదండ్రులను ఉపాధ్యాయుల బృందం నేరుగా కలిసి సర్కారు స్కూళ్లలో ఉన్నసౌకర్యాలను వివరిస్తుండటంతో భారీ సంఖ్యలో ప్రవేశాలు జరుగుతున్నాయి.
505 పాఠశాలలుంటే..
జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లోని 15 మండలాల్లో 505 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, ఇప్పటి వరకు 13, 975 అడ్మిషన్లు రావడం గమనార్హం. ఇందులో ప్రైవేట్ పాఠశాలల నుంచి 981 మంది విద్యార్థులు చేరినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 13న ప్రారంభమైన బడిబాట కార్యక్రమం మరో 6 రోజుల పాటు కొనసాగనుండటంతో పిల్లల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఉచిత విద్య, పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, మినరల్ వాటర్, ఉపకార వేతనాలు, చక్కటి బోధన అందిస్తుండటంతో ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగిపోతున్నాయి.
విద్యార్థుల సంఖ్య పెరిగింది
ఇంగ్లిష్ మాధ్యమంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరిగింది. దీంతో పాటు మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తుండటంతో తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ముం దుకొస్తున్నారు.
– రవీంద్రనాథ్, ప్రధానోపాధ్యాయడు, బహుదూర్పల్లి
నమ్మకం ఏర్పడింది..
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండంతో తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం ఏర్పడింది. అలాగే ఇంగ్లిష్ బోధన అమలుతో కూడా సర్కారు స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
– రామేశ్వర్గౌడ్, పీఆర్టీయూ మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు