చార్మినార్, జూన్ 24 : పాతనగరంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుడిగాలి పర్యటన చేశారు. శుక్రవారం ఆయన యాకుత్పురా నియోజకవర్గంలోని పలు డివిజన్లలో సీవరేజీ, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.15 కోట్ల 7లక్షల 54వేల నిధులతో డబీర్ఫురా, తలాబ్చంచలం, రెయిన్బజార్, కుర్మాగూడ, సంతోష్నగర్, ఐఎస్ సదన్ డివిజన్లలో వరదముంపును తప్పించేందుకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన చేశారు. పనులను వెనువెంటనే ప్రారంభించి పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో యాకుత్ఫురా ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ మిర్జా రియాజ్ ఉల్ హసన్ అఫందీ పాల్గొన్నారు.
డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయండి
మెహిదీపట్నం, జూన్ 24 :ప్రజలకు డ్రైనేజీ సమస్యలు లేకుండా డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. శుక్రవారం టోలిచౌకి డివిజన్లో పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నిర్మాణ పనులను ఎమ్మెల్యే, ఎంఐఎం కార్పొరేటర్ ప్రతినిధి మహ్మద్హరూన్ ఫర్హాన్తో కలసి పరిశీలించారు. ప్రజలకు మౌలిక సౌకర్యాలను కల్పించడానికి చేపడుతున్న అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్మెరాజ్ హుస్సేన్ అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే ఖైరతాబాద్ జడ్సీ రవికిరణ్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులను గురించి చర్చించారు. ఎమ్మెల్యే వాటిని నాణ్యతతో పూర్తి చేయాలన్నారు.