మహేశ్వరం, జూన్ 24:తెలంగాణ సర్కార్ ప్రతి గ్రామంలో క్రీడా మైదానం ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఒక్కో గ్రామంలో ఎకరా స్థలంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాల్లో అందుబాటులో ఉన్న స్థలాలను ఎంపిక చేసి, ఉపాధి హామీ నిధులతో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రీడా ప్రాంగణాల్లో చిన్న పిల్లలు మొదలు..
పెద్దల వరకు అన్ని రకాల క్రీడా సామగ్రిని అందుబాటులో ఉంచడంతోపాటు సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు.ఇందుకు ప్రత్యేకంగా వాకింగ్ ట్రాక్లు, పిల్లల ఆట వస్తువులు, బెంచీలు వంటివి ఏర్పాటు చేస్తున్నారు.
మహేశ్వరంలో 31 గ్రామ పంచాయతీల్లో చేపట్టిన 10 క్రీడా ప్రాంగణాల పనులు పూర్తవుతున్నాయని అధికారులు తెలిపారు. అనుబంధ గ్రామాల్లో కూడా స్థలాలను ఎంపిక చేసి, క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. క్రీడా ప్రాంగాణాల ఏర్పాటుతో గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడిందని
ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామాల్లో క్రీడా మైదానాలు
మండలం పరిధిలోని 31 గ్రామాల్లో క్రీడా మైదానాలను గుర్తించాం. క్రీడా ప్రాంగణాల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. సర్పంచుల సమన్వయంతో పనులను చేపడుతున్నాం. ఇప్పటి వరకు 10 గ్రామాల్లో పనులు పూర్తయ్యాయి. మిగతా గ్రామాల్లో కూడా స్థలాలను గుర్తించాం. ఒకటి రెండు గ్రామాల్లో స్థలాల కొరతతో పనుల్లో జాప్యం జరుగుతున్నది. త్వరలోనే వాటిని కూడా పూర్తిచేస్తాం. ప్రభుత్వ సూచనల మేరకు గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేస్తున్నాం.
– నర్సింహులు, ఎంపీడీవో
క్రీడా ప్రాంగణాలు యువతకు స్ఫూర్తి
క్రీడా ప్రాంగణాలు యువతకు స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఒక ఎకరా స్థలంలో క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కబడ్డీ, వాలీబాల్, ఖోఖో, వ్యాయామానికి ఏర్పాటు చేస్తున్నారు. వీటితో గ్రామాల్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి గ్రామంలో క్రీడాప్రాంగణం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికలను తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నది. రాష్ట్రంలో ప్రతి పల్లె రూపురేఖలు మారుతున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటున్నది.
– కంది అరుణ రమేశ్, సర్చంచ్, మన్సాన్పల్లి