సికింద్రాబాద్/బేగంపేట్, జూన్ 4 : నగరంలో దశాబ్దాల వరద ముంపు సమస్యలకు స్ట్రాటెజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్(ఎస్ఎన్డీపీ) కార్యక్రమంతో త్వరలోనే శాశ్వత పరిష్కారం కానుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం సికింద్రాబాద్ ఎస్పీ రోడ్లోని పికెట్ నాలాపై ఎస్ఎన్డీపీలో భాగంగా రూ.10 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డిలతో కలిసి పరిశీలించారు. వర్షాకాలం సమీపిస్తున్నందున పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. నిజాం కాలంలో నిర్మించిన నాలాలు నేటి వరకు సరైన పర్యవేక్షణ లేక, ఆక్రమణలతో ప్రతి సంవత్సరం వర్షాకాలంలో నగరంలోని నాలాలకు ఎగువ నుంచి వచ్చే వరదనీటితో సమీప కాలనీలు ముంపునకు గురై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఆలోచనతో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ఎస్ఎన్డీపీ కింద నగరంలోని అన్ని నాలాల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు.
నాలాల్లో పూడిక తొలగింపు, రిటైనింగ్ వాల్స్ నిర్మాణం వంటి అభివృద్ధి పనులతో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. నిత్యం ఎంతో రద్దీగా ఉంటున్నందున ఎస్పీ రోడ్లో నాలాపై బ్రిడ్జి నిర్మాణ పనులు ఒక పక్కనే చేపట్టడం జరిగిందని, ఈనెల చివరి నాటికి పనులు పూర్తవుతాయని మంత్రి చెప్పారు.కార్యక్రమంలో రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేశ్, కార్పొరేటర్ మహేశ్వరి, బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్, ప్రభాకర్తో పాటు నేతలు పిట్ల నగేశ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డితో సహా సంబంధిత అధికారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్గౌడ్, శేఖర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.