సిటీబ్యూరో, జూన్ 4 (నమస్తే తెలంగాణ)/ఉస్మానియా యూనివర్సిటీ : ఉన్నత స్థానానికి చేరాలన్న బలమైన ఆకాంక్ష, సానుకూల దృక్పథం, విస్తృత అధ్యయనం, లోతైన అవగాహన ఉంటే సులువుగా పోటీపరీక్షల్లో విజయం సాధించవచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. గ్రామీణ ప్రాంత, పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు పరిపాలనా పదవుల్లోకి రావడం వారికే కాకుండా దేశానికి ప్రయోజనకరమని అభిప్రాయపడ్డారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్, ఇతర పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వ్యూహాలు అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర బీసీ స్టడీ సర్కిల్తో కలిసి సంయుక్తంగా ఉస్మానియా యూనివర్సిటీ అవగాహనా సదస్సును నిర్వహించాయి. ఓయూ డెవలప్మెంట్ అండ్ యూజీసీ ఎఫైర్స్ డీన్, ఎస్సీ, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనారిటీస్ సెల్, సివిల్ సర్వీసెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బుర్రా వెంకటేశం హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులను అసామాన్యులుగా తీర్చిదిద్దే ఆవరణలో చదువుతున్న విద్యార్థులు తమ మూలాలను మరువద్దని సూచించారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు ఏకాగ్రతతో చదవాలని అన్నారు. రెండు పడవలపై ప్రయాణం కాకుండా స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. ఓయూ ఈ1 హాస్టల్లో ఉంటూ ఐఏఎస్ సాధించిన తన జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం బీసీ సంక్షేమ శాఖ నుంచి త్వరలోనే ఓయూ లైబ్రరీకి అయిదు వందల సెట్ల పుస్తకాలను అందించనున్నట్లు ప్రకటించారు. తెలుగు అకాడమీ, ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదవడం ద్వారా అభ్యర్థులకు ప్రాథమిక అవగాహన వస్తుందని వివరించారు. త్వరలోనే విద్యార్థులకు ఓ పోర్టల్ను సైతం అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై నిపుణులు డాక్టర్ సి. వీరేందర్, నూతనకంటి వెంకట్, బండా రవిపాల్రెడ్డి, అశోక్కుమార్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఓయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ అలోక్కుమార్, ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు, బీసీ సెల్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, మైనారిటీ సెల్ డైరెక్టర్ డాక్టర్ సయీదా అజమున్నీసా తదితరులు పాల్గొన్నారు.