మేడ్చల్ జోన్ బృందం, మే 30 : రెడ్ల సింహ గర్జన సభలో కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై దాడి చేయడాన్ని ఆ పార్టీ నేతలు తీ వ్రంగా ఖండించారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించి, దాడికి రేవంత్రెడ్డి వర్గీయులే కారణమని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమాన్ని వివరిస్తూరెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేస్తున్నప్పటికీ తమకెక్కడ రాజకీయంగా నష్టం జరుగుతుందోనన్న భ యంతో కాంగ్రెస్ గుండాలు ఈ దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. తమ తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
దాడి సిగ్గుచేటు : రెడ్డి సంఘం
జవహర్నగర్ : నిరుపేద రెడ్డిల అభ్యున్నతి కోసం మాట్లాడుతుండగా మధ్యలో అడ్డుకోని దాడి చేయడం సిగ్గుచేటని జవహర్నగర్ రెడ్డి సంఘం అధ్యక్షుడు జిట్టా శ్రీనివాస్రెడ్డి అన్నారు. కార్పొరేషన్లోని అంబేద్కర్ చౌరస్తాలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘట్కేసర్లో జరిగిన రెడ్డి సింహ గర్జన సభలో మంత్రి చామకూర మల్లారెడ్డిపై గుండాలతో దాడి చేయించడం రేవంత్రెడ్డి పనేనని, ఇది ముమ్మాటికి పిరికిపందె చర్యే అని అన్నారు. భవిష్యత్తులో రేవంత్రెడ్డిని అడుగడుగునా అడ్డుకుంటామన్నారు. రేవంత్రెడ్డి ఎంపీగా జవహర్నగర్కు చేసిందేమీలేదన్నారు. డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్, కార్పొరేటర్లు ఎడ్ల శ్రీనివాస్రెడ్డి, పల్లపు రవి, కోఆప్షన్మెంబర్ శోభారెడ్డి, రెడ్డి సంఘం నాయకులు మనోధర్రెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దాడి అప్రజాస్వామికం
మేడ్చల్ రూరల్ : నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమానికి పాటుపడుతున్న మంత్రి మల్లారెడ్డిపై దాడి బాధాకరమని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు నారెడ్డి నందారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దయానంద్యాదవ్, మేడ్చల్ పట్టణ అధ్యక్షుడు శేఖర్గౌడ్, నాయకులు మర్రి నర్సింహారెడ్డి, వీర్లపల్లి రాజమల్లారెడ్డి హెచ్చరించారు. మేడ్చల్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. టీఆర్ఎస్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ రెడ్డి కార్పొరేషన్ సాధనకు కృషి చేస్తానని మంత్రి చెపుతుండగా రేవంత్రెడ్డి చెందిన గుండాలు గొడవకు దిగారన్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. అన్ని వర్గాలకు టీఆర్ఎస్ న్యాయం చేస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో రెడ్ల సభను ఏర్పాటు చేసి, సీఎం కేసీఆర్ను పిలిపించి, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు ప్రకటన చేయిస్తామన్నారు. హరివర్ధన్రెడ్డికి మంత్రి మల్లారెడ్డిని విమర్శించే స్థాయి లేదన్నారు. మరోసారి మంత్రి మల్లారెడ్డిని విమర్శిస్తే ఊర్లల్లో తిరగనివ్వమని హెచ్చరించారు. సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయానందారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్లు రణదీప్రెడ్డి, సురేశ్రెడ్డి, సుదర్శన్, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దాడి అమానుషం
మేడ్చల్ రూరల్ : మల్లారెడ్డిపై దాడి చేయడం అమానుషమని గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. వాస్తవానికి మంత్రి మల్లారెడ్డి సభలో మాట్లాడినప్పుడు మొదట్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయని, చప్పట్లతో స్వాగతం పలికారని, దీన్ని చూసి ఓర్వలేకనే దుష్టశక్తులు దాడికి పాల్పడ్డాయని మండిపడ్డారు. ఇలాంటి టీఆర్ఎస్ క్యాడర్ భయపడదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలతో రెడ్డి సామాజిక వర్గానికి న్యాయం జరగలేదా అని ప్రశ్నించారు. ఇకనైనా సంఘ విద్రోహక చర్యలు మానుకోకపోతే ప్రజలే తగ్గి బుద్ధి చెపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు సంజీవగౌడ్, మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాస్రెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి
కీసర/ మేడ్చల్ కలెక్టరేట్ : మంత్రి మల్లారెడ్డి పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలాల్పురం సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. కీసర మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్తో మాట్లాడి, రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చిన మంత్రిపై దాడికి దిగడం చాలా అన్యాయమన్నారు. ఈ దాడి వెనుక కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి హస్తముందన్నారు. కాగా మంత్రి మల్లారెడ్డిపై దాడిని దమ్మాయిగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి పనే
ఘట్కేసర్ : రెడ్డి సింహగర్జనలో మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి పక్కా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పనే నని బోడుప్పల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి ఆరోపించారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రిపై జరిగిన దాడి తీవ్రంగా ఖండించారు. సభ పేరుతో రేవంత్రెడ్డి మంత్రిపై దాడి చేయించాలని పథకం వేశారని ఆరోపించారు. ఇది సరైన పద్దతి కాదని, చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, పోచారం టీఆర్ఎస్ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి, చైర్మన్ కొండల్రెడ్డి పాల్గొన్నారు.
కక్షపూరిత చర్య
శామీర్పేట : రెడ్డి గర్జనలో మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి కక్షపూరిత రాజకీయ చర్య అని మూడుచింతలపల్లి మండలంలోని ప్రజాప్రతినిధులు, రెడ్డి సంఘం నేతలు ధ్వజమెత్తారు. మంత్రిపై జరిగిన దాడిని నిరసిస్తూ మూడుచింతలపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రెడ్డి గర్జన వేదికగా రేవంత్రెడ్డి గుండాలతో దాడులకు పాల్పడ్డాడని ఆరోపించారు. మంత్రిపై జరిగిన దాడులకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, సర్పంచ్ల సంఘం మం డల అధ్యక్షుడు విష్ణువర్ధన్రెడ్డి, హరిమోహన్రెడ్డి, జామ్ రవి, మురళీగౌడ్, రవీందర్రెడ్డి, కో ఆఫ్షన్ సభ్యుడు గౌస్పాష పాల్గొన్నారు. రెడ్డి గర్జనను కొందరు స్వార్థరాజకీయాలకు వాడుకుంటున్నారని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, రైతుబంధు మండల అధ్యక్షుడు కంటం కృష్ణారెడ్డి ఆరోపించారు. మంత్రిపై జరిగిన దాడిని ఖండిస్తూ సోమవారం శామీర్పేటలో సమావేశం నిర్వహించారు. సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు సరసం మోహన్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సర్పంచ్ కృపాకర్రెడ్డి, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి సతీశ్రెడ్డి, డైరెక్టర్లు భూమిరెడ్డి, నర్సింహారెడ్డి, మాజీ డైరెక్టర్ నాగమల్లారెడ్డి, నర్సింహారెడ్డి, వెంకట్రెడ్డి పాల్గొన్నారు.