సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): ఒక తెలుగు జాతి బిడ్డగా ప్రపంచ ఖ్యాతి గడించిన వ్యక్తి ఎన్టీఆర్ అని హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానుభావుడని, పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, సాంఘిక చిత్రాలతో అనేక పాత్రలను పోషించిన నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకు తానే సాటి అని, అనేక పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని అని అన్నారు. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా తల ఎత్తుకుని గర్వంగా ఉండేలా చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని మాగంటి గోపీనాథ్ ‘నమస్తే తెలంగాణ’తో పంచుకున్నారు. ఎన్టీఆర్ను ఆదర్శంగా తీసుకొని 1982లో రాజకీయాల్లోకి వచ్చి టీడీపీలో చేరానని తెలిపారు. పార్టీలో చేరిన కొద్ది కాలానికి ఆయన అభిమానాన్ని పొందానని, తన పనితీరును చూసి 1985లో ఎన్టీఆర్ స్వయంగా నగర తెలుగు యువత అధ్యక్షుడిగా ఎంపిక చేశారని వివరించారు. 1987లో హుడా చైర్మన్ గానూ, 1989లో నేషనల్ యూత్ ఫ్రంట్ ప్రతినిధిగా ఎంపికయ్యాయని తెలిపారు. ఎన్టీఆర్ తర్వాత అంతటి రాజకీయ లక్షణాలున్న వ్యక్తిత్వాన్ని సీఎం కేసీఆర్లోనే చూశానని మాగంటి గోపీనాథ్ పేర్కొన్నారు.
‘మహా నటుడు..ఎన్టీఆర్’ పుస్తకావిష్కరణ
బంజారాహిల్స్: విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంత్యుత్సవాల సందర్భంగా ప్రముఖ పాత్రికేయులు, రచయిత భగీరథ రచించిన ‘మహానటుడు.. ప్రజా నాయకుడు ఎన్టీఆర్’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఫిలింనగర్లో నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఫిలింనగర్ సొసైటీ అధ్యక్షుడు జి.ఆదిశేషగిరిరావు, నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఎన్టీఆర్ నటనా జీవితంతో పాటు ప్రజా జీవితంలో ముఖ్య సంఘటనలతో పాటు ఇంటర్వ్యూలు, ఆర్టికల్స్ ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు రచయిత భగీరథ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫిలింనగర్ సొసైటీ కార్యదర్శి కాజా సూర్యనారాయణ, సినీ ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, ప్రసన్న కుమార్, గారపాటి లోకేశ్వరి పాల్గొన్నారు.