మియాపూర్, మే 23 : వర్షాకాలం నేపథ్యంలో ముంపు సమస్య పునరావృతం కాకుండా చందానగర్ సర్కిల్లో అధికారులు పటిష్ట చర్యలను చేపడుతున్నారు. గత వర్షాలకు సర్కిల్ పరిధిలోని ఖుషీనగర్, ఎంఏనగర్, దీప్తిశ్రీనగర్ మంపు ప్రభావానికి గురైన నేపథ్యంలో ఈ సారి ఆ సమస్య లేకుండా చూడాలని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. దీంతో ప్రధానంగా నాలాలను శుభ్రపరిచే పనులను చేపడుతున్నారు. జోనల్ కమిషనర్ శంకరయ్య ఆదేశాల మేరకు ఇక్కడి చందానగర్ సర్కిల్, ఇంజినీరింగ్ అధికారులు తమ పరిధిలో డీసిల్టేషన్ను ముమ్మరంగా చేపడుతున్నారు. ఈ నెల చివరి కల్లా పనులను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే ఇందుకు గడువు మరో వారం రోజులే ఉండటం.. ఇప్పటి వరకు 50 శాతం పనులే పూర్తి అయ్యాయి. అధికారులు పనులలో వేగం పెంచాలని ముంపు ప్రాంతాల వాసులు అభ్యర్థిస్తున్నారు.
25 కిలో మీటర్ల మేర నాలా పనులు..
చందానగర్ సర్కిల్ వ్యాప్తంగా 25 కిలో మీటర్ల మేర నాలా విస్తరించి ఉన్నది. అయితే వర్షాకాలం నేపథ్యంలో నాలాల్లో డీసిల్టేషన్ పనులను 11 పనుల కింద విభజించి టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించారు. ఇందుకోసం రూ.2.41 కోట్ల నిధులను కేటాయించారు. కాగా మొత్తం నాలాలో 16 కిలో మీటర్లు యంత్రాల సాయంతో.. మిగిలిన 9 కిలో మీటర్లు కూలీల సాయంతో చేపడుతున్నారు. అయితే ఈ నెల మొదటి వారంలో నాలాలో డీసిల్టేషన్ పనులను ప్రారంభించగా..ఇప్పటి వరకు 11 కిలో మీటర్ల మేర పూర్తయింది. ఇంకా 14 కిలో మీటర్ల మేర పనులను నెలాఖరుకల్లా పూర్తి చేయాల్సి ఉన్నది. సర్కిల్ పరిధిలోని చందానగర్ డివిజన్లోనే రూ.1.40 కోట్ల వరకు వెచ్చించి నాలాల డీసిల్టేషన్ను చేపడుతున్నారు.
యంత్రాల సాయంతో, కూలీల సాయంతో చేపడుతున్న నాలాల్లో వ్యర్థాల తొలగింపు గుట్టలుగా వ్యర్థాలు పోగవుతున్నాయి. అయితే వీటిని వెంటనే తొలగిచంటం లేదని, రోడ్డు పక్కనే వదిలేసి వెళుతున్నారని, దుర్వాసనతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆయా కాలనీల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీసిల్టేషన్ వ్యర్థాలు పొడిగా ఉన్నపుడు వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. గతేడాది వర్షాలకు దీప్తిశ్రీనగర్, ఏంఏ నగర్, లక్ష్మీనగర్లు ముంపునకు గురికావడంతో ఆయా కాలనీల ప్రజలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాలాలను పూర్తి స్థాయిలో శుభ్రం చేసి ముంపు సమస్య రాకుండా చూస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తాం..
వర్షాకాలం నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ముంపు సమస్య పునరావృతం కాకుండా ముందస్తు చర్యలను చేపడుతున్నాం. ప్రధానంగా నాలాల్లో వ్యర్థాల తొలగింపు పనులను చేపడుతున్నాం. సర్కిల్ వ్యాప్తంగా 20 కిలో మీటర్లకు పైగా ఉన్న నాలాల్లో డీసిల్టేషన్ను చేపట్టేందుకు 11 పనులుగా విభజించాం. పెద్ద వాటిల్లో యంత్రాల సాయంతో డీసిల్టేషన్ను, చిన్న డ్రైన్లలో కూలీల సాయంతో పనులను చేపడుతున్నాం. ఇప్పటికే 11 కిలో మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ఈ నెలాఖరులోగా మిగిలిన పనులను పూర్తి చేస్తాం. తొలగించిన వ్యర్థాలను జాప్యం లేకుండా ప్రత్యేక వాహనాల ద్వారా తొలగింపును చేపడుతున్నాం.
– నందగిరి సుధాంశ్, ఉప కమిషనర్ చందానగర్ సర్కిల్