ముషీరాబాద్, మే 23: వానాకాలం మొదలయ్యే నాటికి శిథిల భవనాల తొలగింపునకు జీహెచ్ఎంసీ సర్కిల్-15 అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఏటా జూన్లో శిథిల భవనాలపై దృష్టిసారిస్తున్న అధికారులు ఈ సారి ముందస్తుగానే శిథిల భవనాలను గుర్తించి, తొలగింపు చర్యలు చేపట్టాలని యోచిస్తున్నారు. ఇందు లో భాగంగా శిథిల భవనాల గుర్తింపు, నోటీసుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. గతంలో వర్షాలకు పురాతన భవనాలు కూలి పలువురు మృత్యువాత పడిన నేపథ్యంలో అధికారులు మందస్తు చర్యలు చేపడుతున్నారు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న 11 శిథిల భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. గతంలో నోటీసులు ఇచ్చినా ముందుకారానికి 6 భవనాల యజమానులకు మరోమారు నోటీసులు ఇచ్చారు. కాకుండా బస్తీలు, కాలనీల్లో టౌన్ప్లానింగ్ సిబ్బంది రోజు వారి సర్వే చేస్తున్నారు.
త్వరలోనే మరిన్ని శిథిల భవనాలను గుర్తించి యాజమానులకు నోటీసులు జారీ చేయడానికి కసరత్తు చేస్తున్నారు. కొన్ని చోట్ల శిథిల భవనాల యాజమానులకు, ప్రభుత్వ భవనాలకు సంబంధించిన ఆయా శాఖలకు నోటీసులు జారీ చేసినా, హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. తిరిగి వారిని దారిలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న బస్తీలో పదుల సంఖ్యలో ఉన్న శిథిలమై ఇండ్లు, ముషీరాబాద్ చేపల మార్కెట్, రాంనగర్ దాయర మార్కెట్ పరిసరాల్లో శిథిల భవనాలు ప్రమాదకరంగా ఉన్నాయి.
ముందస్తు చర్యలు చేపడుతున్నాం..
త్వరలో వర్షాకాలం మొదలు కానున్న నేపథ్యంలో శిథిల భవనాల తొలగింపు చర్యలు మొదలు పెట్టాం. ఇప్పటికే పలు భవనాలను గుర్తించి, నోటీసులు అందజేశాం. శిథిల భవనాల్లో ఉంటున్న వారు ఖాళీ చేయాలి. లేదా తొలగించుకోవాలి. శిథిల భవనాల స్థితిగతులను చెప్పాల్సిందిగా ఇంజినీరింగ్ అధికారులను కోరడం జరిగింది.
– జీ పావని, ఏసీపీ టౌన్ప్లానింగ్