సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను సోమవారం రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. 427 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్నదని పోలీసుల విచారణలో తేలింది. నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ ప్రాంతానికి చెందిన చెరుకుపల్లి శ్రీకాంత్, ఏపీకి చెందిన నాయికం రాహుల్, వినాయక్, బానావత్ కిషన్, బానావత్ నాగా, గౌలికర్ సాయి అజయ్, సాయినాథ్ చౌహాన్, జర్రిపోతుల రవళి, దొమాట సంగీత కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నారు.
ఈ ముఠా సభ్యులైన శ్రీకాంత్, రాహుల్కు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీకి చెందిన ఆకాశ్ కుమార్, రాజు, సన్యాసిరావుతో సంబంధాలు ఉన్నాయి. వీరు ఏపీ, ఒడిశా రాష్ర్టాల నుంచి రూ. 3 వేలకు కేజీ చొప్పున గంజాయిని కొనుగోలు చేసి, దానిని ముంబైలోని ముఠాలకు రూ. 20 వేలకు కేజీ చొప్పున విక్రయిస్తున్నారు. ఈ దందా కోసం ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా వీరు తిరిగే కారులో మహిళలను కూడా వెంట తీసుకువెళ్తున్నారు. ఈ ముఠా గురించి సమాచారం అందుకున్న హయత్నగర్ పోలీసులు నిఘా పెట్టారు. ఆదివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా డొకరాయి నుంచి హైదరాబాద్ మీదుగా ముంబైకి వెళ్తున్న క్రమంలో ఓఆర్ఆర్ ఎక్కుతుండగా పసుమాముల వద్ద పట్టుకున్నారు. అక్కడ వీరి రెండు కార్లను ఆపిన పోలీసులు తనిఖీ చేశారు.
10 మందిని అరెస్టు చేసి, 472 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి మొత్తం రూ. 1.20 కోట్లు విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడైన శ్రీకాంత్ గతంలో ఇండ్లల్లో దొంగతనాలు చేసి జైలుకు వెళ్లాడని, జైలులో ఏర్పడ్డ పరిచయాలతోనే గంజాయి స్మగ్లర్గా మారినట్టు పోలీసులు తెలిపారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్ ఇన్చార్జి డీసీపీ వెంకటేశ్వర్లు, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డి, హయత్నగర్ ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, నిరంజన్ పాల్గొన్నారు. ఈ ముఠాను పట్టుకున్న అధికారులు, సిబ్బందికి అదనపు సీపీ రివార్డులను అందజేశారు. గంజాయి దందాకు సంబంధించిన సమాచారం ఉంటే ప్రజలు డయల్ 100 లేదా రాచకొండ వాట్సాప్ నంబరు లేదా 9490617111కు సమాచారం ఇవ్వాలని అదనపు సీపీ సూచించారు.