మల్కాజిగిరి, మే 23:బల్దియా పరిధిలోని బీజేపీ కార్పొరేటర్ల ఆగడాలు రోజురోజుకూ మితిమీరి పోతున్నాయి. వీధిరౌడీల్లా వ్యవహరిస్తూ.. మహిళా ఆధికారుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ.. బెదిరింపులకు దిగుతున్నారు. ఈ సంఘటన సోమవారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలోని డీసీ చాంబర్లో చోటుచేసుకున్నది. డీసీ కండ్లెదుటే మహిళా అధికారి మీదకు దూసుకుపోతూ.. భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో కార్పొరేటర్ తీరును నిరసిస్తూ.. అధికారులు నల్ల బ్యాడ్జీలతో నిరసనకు దిగారు. మహిళా అధికారి పట్ల దురుసుగా ప్రవర్తించిన కార్పొరేటర్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే..
సోమవారం మల్కాజిగిరి సర్కిల్ గౌతంనగర్ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడానికి డీఈ లౌక్య వెళ్లారు. అక్కడ ఇతర అధికారులతో కలిసి పనులను పరిశీలిస్తుండగా సర్కిల్ డీసీ రాజు నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. వెంటనే సర్కిల్ కార్యాలయానికి చెరుకున్న డీఈ లౌక్య నేరుగా డీసీ చాంబర్స్కు వెళ్లింది. అప్పటికే అక్కడున్న మల్కాజిగిరి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి ఆమెను ప్రశ్నించారు. కార్పొరేటర్ వేసిన ప్రశ్నలకు డీఈ సమాధానం చెబుతుండగానే ఆమెపై ఆగ్రహంతో ఊగిపోయారు. దశలవారీగా సమస్యలను పరిష్కరిస్తున్నామని, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని డీసీ రాజు ఎంత వారించినా వినిపించుకోలేదు. డీసీ చాంబర్లోని టేబుల్పై చేయితో గట్టిగా కొట్టిన కార్పొరేటర్ పెద్ద ఎత్తున అరుస్తూ.. డీఈ మీదకు దూసుకుపోయారు. వివిధ పనుల నిమిత్తం సర్కిల్ కార్యాలయానికి వచ్చిన జనం.. ఇది చూసి కార్పొరేటరా.. వీధి రౌడీనా.. అని అనుకోవడం గమనార్హం.
నల్లా బ్యాడ్జీలతో అధికారుల నిరసన
మల్కాజిగిరి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ సర్కిల్ కార్యాలయంలోని డీసీ చాంబర్స్లో అధికారులపై దౌర్జన్యంగా ప్రవర్తించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మల్కాజిగిరి డివిజన్లో 2021-22లో రూ.8.82కోట్లతో 57అభివృద్ధి పనులను పూర్తిచేశామని, మరో రూ.7.87కోట్లతో 21 అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రూ.4.68కోట్లతో 24అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. డివిజన్లో ఇన్ని కోట్ల అభివృద్ధి పనులు చేపడుతున్నా.. అవేవి పట్టించుకోకుండా అధికారులపై కావాలనే కార్పొరేటర్ ఇలా దురుసుగా ప్రవర్తించారని మండిపడ్డారు. పనుల్లో జాప్యం జరిగితే పై అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప.. మహిళా అధికారి డీఈ లౌక్యను దూషించడం సరికాదని మండిపడ్డారు. వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ శ్రావణ్ ప్రవర్తనకు నిరసనగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నామని, ఈ విషయమై పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈఈ లక్ష్మణ్, డీఈలు మహేశ్, లౌక్య, ఏఈ దీపక్, తదితరులు పాల్గొన్నారు.
కార్పొరేటర్పై కేసు నమోదు
మల్కాజిగిరి డివిజన్ బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్పై కేసు నమోదైంది. మల్కాజిగిరి పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీశ్వర్ కథ నం ప్రకారం.. మ ల్కాజిగిరి సర్కిల్ కార్యాలయంలో డీఈగా పనిచేస్తున్న లౌక్యను డిప్యూటీ కమిషనర్ రాజు సమక్షంలో కార్పొరేటర్ శ్రావణ్ పరుష పదజాలంతో దూషించాడు. డీఈ లౌక్య ఫిర్యాదు మేరకు కార్పొరేటర్ శ్రావణ్పై 353, 504, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.