హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి విస్తరిస్తోంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా వదిలేయకుండా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) మౌలిక వసతుల కల్పనపై ప్రధానంగా దృష్టి సారించింది. దీంతో శివారు ప్రాంతాల్లో అటు మున్సిపాలిటీలు, ఇటు హెచ్ఎండీఏలు అభివృద్ధి పనులు చేపడుతూ మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నాయి.
శివారు ప్రాంతాల అభివృద్ధిలో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సంస్థలను భాగస్వామ్యం చేస్తూ ఔటర్ రింగు రోడ్డు లోపల, బయట ప్రాంతాల్లో ప్రణాళికాబద్ధంగా పట్టణీకరణ జరిగేలా చర్యలు చేపట్టారు. ముఖ్యంగా ప్రజా రవాణా వ్యవస్థలు శివారు ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అందుకు నిదర్శనం కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి ఐటీ కారిడార్ మీదుగా కోకాపేట వరకు ఎలివేటెడ్ బస్ రాపిడ్ సిస్టమ్ వంటి ప్రాజెక్టుల ప్రతిపాదనను హెచ్ఎండీఏతో కలిసి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ రూపొందిస్తోంది. అదేవిధంగా రాయిదుర్గం మెట్రోస్టేషన్ నుంచి గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రోరైలు వంటి ప్రాజెక్టుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
వేగంగా పట్టణీకరణ..
కొత్తగా నివాస ప్రాంతాలు జీహెచ్ఎంసీ పరిధిలోనే కాకుండా హెచ్ఎండీఏ పరిధిలో ఔటర్ రింగు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాల్లో భారీ ఎత్తున వస్తున్నాయి. వేగంగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో హెచ్ఎండీఏ రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులు ఏడాది వ్యవధిలో ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే జీహెచ్ఎంసీ పరిధి తర్వాత ఉన్న ఔటర్ రింగు రోడ్డు లోపల ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో క్షేత్ర స్థాయిలో రోడ్ల అభివృద్ధిపై సర్వే చేశారు. వీటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు హెచ్ఎండీఏ నూతన ప్రణాళికను సిద్ధం చేసింది.
కోర్ సిటీకి దీటుగా శివారు మున్సిపాలిటీలు..
గ్రేటర్ చుట్టూ ఉన్న శివారు మునిసిపాలిటీల్లో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ,
విద్యుత్, పార్కులు వంటివి ఎంతో కీలకం. ఇప్పటి వరకు హెచ్ఎండీఏ పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఇవన్నీ అరకొరగానే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీ, హెచ్ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్లలోనే మౌలిక వసతులు ఉన్నాయి. ఓఆర్ఆర్ లోపల ఉన్న స్థానిక మున్సిపాలిటీలైన జల్పల్లి, బడంగ్పేట, మీర్పేట, నార్సింగి, మణికొండ, నిజాంపేట, కొంపల్లి, శంషాబాద్, తుక్కుగూడ, ఆదిభట్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, మేడ్చల్ మునిసిపాలిటీల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనకు ప్రధానంగా దృష్టి సారించింది. కోర్ సిటీ అయిన జీహెచ్ఎంసీ పరిధిలో ఎలాంటి మౌలిక వసతులు ఉన్నాయో, అదేవిధంగా శివారు మునిసిపాలిటీల్లోనూ ఉండేలా ఆయా మునిసిపాలిటీలతో కలిసి హెచ్ఎండీఏ సొంత నిధులను వినియోగిస్తూ అభివృద్ధి పనులు చేపడుతోంది.
అధికంగా లింకు రోడ్లు..
హెచ్ఎండీఏ పరిధిలోని శంకర్పల్లి జోన్లోని ఐటీ కారిడార్లో ప్రధాన రహదారులతో పాటు ప్రత్యామ్నాయంగా పలు లింకు రోడ్లను అభివృద్ధి చేశారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్, మాదాపూర్ నుంచి నేరుగా ఔటర్ రింగు రోడ్డు వరకు సిగ్నల్ లేకుండా ఉండే లింకు రోడ్లను నిర్మిస్తున్నారు. ఇదే విధంగా దక్షిణాదిన ఉన్న శంషాబాద్, తూర్పున ఉన్న ఘట్కేసర్, ఉత్తరాన్న ఉన్న మేడ్చల్ జోన్ల పరిధిలోని ప్రాంతాల్లో రేడియల్ రోడ్ల నుంచి కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీలకు లింకు రోడ్లను మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ జోన్ పరిధిలో బాచుపల్లి నుంచి మల్లంపేట మీదుగా బౌరంపేట వరకు రోడ్డు విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి.
మెరుగైన రోడ్డు నెట్ వర్క్..
ప్రసుత్తం కోర్ సిటీలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు నగర శివారు ప్రాంతాల్లో భవిష్యత్లో తలెత్తకుండా ఇప్పటి నుంచే రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. ముఖ్యంగా రోడ్ల విస్తీర్ణంలో 60 అడుగుల నుంచి 80, 100, 120 అడుగుల విస్తీర్ణంతో ఉండేలా హెచ్ఎండీఏ పర్యవేక్షణ చేస్తోంది. కొత్తగా లేఅవుట్లకు అనుమతులు ఇవ్వాలంటే అప్రోచ్ రోడ్డు కనీసం 100 అడుగులు ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నారు. దీంతో భవిష్యత్లో ఆయా ప్రాంతాల్లో ఎంత ట్రాఫిక్ పెరిగినా తట్టుకునేలా రోడ్లను తీర్చిదిద్దుతున్నారు. వీటికి తోడు హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్కు అనుగుణంగా నగరంలోని ఇన్నర్ రింగురోడ్డు నుంచి ఔటర్ రింగు రోడ్డు వరకు 33 రేడియల్ రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించగా, అందులో 4-5 మినహా మిగతా అన్నింటిని పూర్తి చేశారు.