కాచిగూడ, మే 21: భారతదేశం స్వయం ప్రతిపత్తి సాధించాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా అడ్వయిజర్, చీఫ్ స్పోక్స్పర్సన్ డాక్టర్ సంజయ్ బారు అన్నారు. ఆర్.జి. కేడియా కళాశాల, మార్వాడి శిక్ష సమితి, ఎంఎస్ఎస్ లా కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఇండియా అండ్ ది పోస్ట్-ఉక్రెయిన్ వరల్డ్ సెమినార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సంజయ్ బారు హాజరై మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సమయంలో ఇండియా సరియైన నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. ఇతర దేశాలతో పోల్చితే ఇండియా అన్ని రంగాల్లో ఆర్థిక ప్రగతిని సాధిస్తున్నదని ఆయన అన్నారు. ఐటీ రంగంలో దేశంలోనే మన నగరం గ్లోబల్ సిటీగా తయారైందని, అన్ని రకాల పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రదేశమని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మార్వాడి శిక్ష సమితి అధ్యక్షుడు కమల్ నారాయణ్ అగర్వాల్, కార్యదర్శి సురేంద్ర లూనియా, ఆర్జీ కేడియా కళాశాల డైరెక్టర్ డాక్టర్ డీవీజీ క్రిష్ణ, సహయ కార్యదర్శి ఎస్.బి కాబ్రా తదితరులు పాల్గొన్నారు.