వెంగళరావునగర్, మే 18: అక్రమంగా పిల్లలను దత్తత తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి కరాటే కళ్యాణి బుధవారం హైదరాబాద్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరయ్యింది. వెంగళరావు నగర్లోని స్టేట్ హోం ఆవరణలోని బాలసదనంలో నిర్వహించిన విచారణకు ఆమె పాపతో కలిసి రాగా.. పాపను కన్నతల్లి స్వప్న ఒడికి అధికారులు చేర్చారు. పాపను తాను దత్తత తీసుకోలేదని.. అవసరమైతే న్యాయబద్ధంగా దత్తత తీసుకుంటానని సినీనటి కళ్యాణి తెలిపారు.
పాప తల్లిదండ్రులు గోవర్దన్, స్వప్నలు తమ ఇంట్లో ఉండేవారని.. వారి ఇంటికి కూడా తాను వెళ్తుంటానని.. అందుకే పాప తన వద్ద ఉంటుందని విచారణలో తెలిపారు. పాప తల్లిదండ్రులకు తానెంతో సాయం చేశానని తెలిపారు. కరాటే కళ్యాణి దత్తత వ్యవహారంపై నిజాలు నిగ్గు తేలాల్సిన అవసరం ఉందని.. అందుకే ఈ కేసును రంగారెడ్డి జిల్లా సీడబ్ల్యూసీకి అప్పగించామని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ శైలజా పేర్కొన్నారు. అంతేకాకుండా కళ్యాణి వద్ద ఉన్న 12 ఏండ్ల బాబు వివరాలు కూడా తెలియాల్సి ఉందన్నారు. ఈ విచారణలో చైల్డ్ వెల్ఫేర్ చైర్పర్సన్తో పాటు సభ్యులు లలిత, ప్రమోద పాల్గొన్నారు.
నేనే తప్పు చేయలేదు..
నేను ఏ తప్పు చేయలేదు. నాపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. నాపై కావాలనే కొందరు కుట్ర పన్నుతున్నారు. అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇంట్లో తనిఖీలు చేశారు. కావాలనే కొందరు కుట్ర చేసి కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారు. దత్తత తీసుకోవాలంటే చట్టబద్ధంగా వ్యవహారించాలని అధికారులు తెలిపారు. దత్తత తీసుకోవాలా లేదా అన్నది నా ఇష్టం. అధికారులు క్లీన్చిట్ ఇచ్చారు. నాపై ఎలాంటి నిరాధార ఆరోపణలు చేయవద్దు.
– కరాటే కళ్యాణి