రంగారెడ్డి జిల్లా కోర్టులు, మే 18 (రంగారెడ్డి జిల్లా కోర్టులు): మద్యం మత్తులో భార్యతో గొడవ పడి హత్య చేసిన భర్త రమావత్ శ్రీనుకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా మెట్రొపాలిటన్ సెషన్స్ జడ్జి తీర్పునిచ్చారు. నల్గొండ జిల్లా వెంకటంపేట్ తండాకు చెందిన రమావత్ శ్రీను బతుకు దెరువు కోసం కుటుంబంతో కలిసి యాచారం మండలం తక్కళ్లపల్లి గ్రామానికి వచ్చాడు. అయితే మద్యానికి బానిసైన శ్రీను భార్య లలితపై అనుమానం పెంచుకొని వేధించడం మొదలు పెట్టాడు. 2021 మార్చి 30న వారిద్దరూ గొడపడ్డారు. అయితే ఈ విషయం తెలుసుకున్న లలిత సోదరుడు వారి ఇంటికి వెళ్లే సరికి చెల్లె రక్తం మడుగులో పడి చనిపోయి ఉండటంతో యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి శ్రీనుపై కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. సాక్షాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి జీవితఖైదు విధించింది.
సన్నిహితంగా ఉంటున్నాడని హత్య..
తన ప్రియురాలుతో సన్నిహితంగా ఉంటున్న ఒకరిని హత్య చేసిన నిందితుడు పల్లపోలు రాజుకు యావజ్జీవ కారాగార శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ రంగారెడ్డి మూడవ అదనపు జిల్లా జడ్జి తీర్పునిచ్చారు. అదనపు పీపీ నక్కా రవీందర్ కథనం మేరకు..శంషాబాద్ మండలం తొండుపల్లికి చెందిన రాజు భార్యతో విడాకులు తీసుకొని మరో మహిళతో పరిచయం పెంచుకున్నాడు. శంషాబాద్ దగ్గరలోని రోజ్ గార్డెన్లో ఇద్దరు కలిసి పని చేస్తుండగా అక్కడే గాజుల పెద్ద వెంకటయ్య పరిచయం అయ్యాడు. అతడు రాజు తీసుకొచ్చిన మహిళతో సన్నిహితంగా ఉంటుండగా భరించలేని రాజు మద్యం తాగించి కర్రతో కొట్టి చంపేశాడు. అనంతరం తొండుపల్లి శివారులో పడేశాడు. అనంతరం కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు నిందితుడు రాజును అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచాడు. సాక్ష్యాలను పరిశీలించిన న్యాయస్థానం అతడికి జీవిత ఖైతు విధించింది.