సిటీబ్యూరో,మే 17(నమస్తే తెలంగాణ):డెలివరీ చేద్దామంటే చేతిలో వాహనం లేదు.. రోజుకు 20 మందికి మాత్రం గంజాయిని డోర్ డెలివరీ చేస్తున్నాడు. పోలీసులకు చిక్కకుండా.. తన అక్రమ వ్యాపారాన్ని ఎవరూ గుర్తించకుండా.. ఓ గంజాయి స్మగ్లర్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. దీని కోసం జర్నీ విత్ రాపిడోను ఎంచుకున్నాడు. కేవలం చేతిలో ఫోన్, జేబులో గంజాయి పెట్టుకుని నగరమంతా తిరిగేస్తున్నాడు. సమాచారం అందుకున్న రాచకొండ మల్కాజిగిరి ఎస్ఓటీ పోలీసులు కాప్రా శంకరమ్మ కాలనీకి చెందిన మునియాడీ మురుగేశన్ను మంగళవారం అరెస్టు చేశారు.
రాపిడోను వాడేసిన మురుగేశన్
విచారణలో మురుగేశన్ ఆసక్తికరమైన గంజాయి డెలివరీ రహస్యాన్ని విప్పాడు. వేగవంతమైన, సురక్షితమైన, తక్కువ ఖర్చుతో కూడిన ప్రయాణం కోసం రాపిడో సంస్థ సేవలను వినియోగించుకున్నాడు. గంజాయి డెలివరీ కోసం సొంత వాహనం వాడితే పోలీసులకు దొరికినప్పుడు ఆ వాహనం జప్తు కావడంతో పాటు తన స్మగ్లింగ్కు సంబంధించి సమాచారం ఇట్టే దొరికిపోతుందని ఆలోచనకు వచ్చాడు. తన స్మగ్లింగ్ను ఎవరూ గుర్తించకుండా ఉండాలంటే రాపిడో సంస్థ అందిస్తున్న ద్విచక్ర వాహన ట్రావెలింగ్ సౌకర్యాన్ని ఎంచుకున్నాడు. గంజాయి తీసుకునేందుకు, వినియోగదారులకు డెలివరీ చేసేందుకు కూడా రాపిడో ట్రావెలింగ్ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నాడు. ఇలా ఏ సమయంలోనైనా రాపిడో ద్వారా ప్రతి రోజు 20 మందికి గంజాయి డోర్ డెలివరీ చేసినట్లు తెలిపాడు. ఇప్పటి వరకు సుమారు 200 రాపిడో బుకింగ్ల ద్వారా నగరంలో మత్తు బాబులకు గంజాయిని సులభంగా, సురక్షితంగా డెలివరీ చేసినట్లు విచారణలో తేలింది.
ఒక్కో ప్యాకెట్ రూ.400
ధూల్పేట్తో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువస్తున్న మురుగేశన్ వాటిని చిన్న చిన్న ప్యాకెట్లలో 15 గ్రాములు నింపుతున్నాడు. ఆ ప్యాకెట్లను రూ.400 నుంచి 600లకు ఒకటి చొప్పు న విక్రయిస్తున్నా డు. మరికొందరికి సిగరేట్లుగా మార్చి అధిక ధరకు విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తెలిసింది. కాగా గంజాయి సరఫరా చేస్తూ గతంలో రెండు సార్లు పట్టుబడిన మురిగేశన్ పోలీసులకు దొరకొద్దనే రాపిడోను ఎంచుకున్నట్లు తెలిసింది. అయితే గంజాయి దందా సాగిస్తున్నట్లు రాపిడో వాహన దారులకు తెలియదని పోలీసులు గుర్తించారు.