సిటీబ్యూరో, మే 16 (నమస్తే తెలంగాణ): మెట్రో రెండోదశలోని మార్గాల్లో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇప్పటికే రెండో దశకు సంబంధించి పలు మార్గాలను అధ్యయనం చేసిన ఢిల్లీ మెట్రోరైల్ ప్రభుత్వానికి డీపీఆర్ను అందజేసింది. అయితే కరోనా కారణంగా ఈ ప్రాజెక్టు జాప్యం కాగా.. నగరంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలు పలు మౌలిక సదుపాయాలు చేపట్టి పలు ప్రాంతాల్లో కొత్తగా ఫ్లై ఓవర్లు, అండర్పాసులు, లింక్రోడ్లను అందుబాటులోకి తెచ్చాయి. ఈ నేపథ్యంలో రెండో దశలో ప్రతిపాదించిన బీహెచ్ఈఎల్ లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, మెహదీపట్నం మీదుగా లక్డీకాపూల్ వరకు నిర్మించ తలపెట్టిన మార్గాల్లో తాజాగా మార్పులు చేర్పులు చేయాల్సిన అనివార్యం ఏర్పడింది.
అడ్డు రావడంతోనే..
గ్రేటర్ హైదరాబాద్లో బీహెచ్ఈఎల్- పటాన్చెరు ప్రాంతం అత్యంత కీలకమైంది. ముంబయి జాతీయ రహదారిపై ఉన్న ఈ ప్రాంతం మీదుగా కోర్సిటీకి మెట్రోను నిర్మించడం ద్వారా నిత్యం లక్షలాది మందికి ప్రయోజనం కలుగుతుంది. బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్, కొండాపూర్ల మీదుగా గచ్చిబౌలి, షేక్పేట, టోలిచౌకి, మెహిదీపట్నం, లక్డీకాపూల్ వరకు రెండో దశలో మెట్రో మార్గాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే రెండేండ్లలో మియాపూర్ నుంచి కొండాపూర్, గచ్చిబౌలి, రాయిదుర్గం, షేక్పేట, టోలిచౌకి ప్రాంతాల్లో పలు ైప్లె ఓవర్ల నిర్మాణం చేపట్టారు. దీంతో ఇవన్నీ ప్రతిపాదిత మెట్రో మార్గానికి అడ్డుగా వచ్చాయి. ఈ పరిస్థితుల్లో మెట్రో మార్గం కోసం దిమ్మెలను నిర్మించాలంటే పెద్దమొత్తంలో భూములు సేకరించాల్సిన అవసరం ఏర్పడింది. అంతేకాక ఫ్లై ఓవర్లు వచ్చిన చోట మెట్రో దిమ్మెలను చాలా ఎత్తుగా నిర్మించాల్సి వస్తుండటంతో రెండో దశలో చేపట్టే బీచ్ఈఎల్-లక్డీకాపూల్ మార్గంలో మార్పు లు చేయాల్సి ఉంటుందని, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని మెట్రో అధికారులు తెలిపారు.
రెండో దశలో ప్రతిపాదించిన మెట్రో మార్గాలు..
1. బీహెచ్ఈఎల్ లింగంపల్లి నుంచి గచ్చిబౌలి, మెహిదీపట్నం మీదుగా లక్డీకాపూల్ వరకు.. (27 కి.మీ)
2. నాగోల్ నుంచి ఎల్బీనగర్.. (5 కి.మీ)
3. రాయిదుర్గం నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా శంషాబాద్ విమానాశ్రయం వరకు.. (31 కి.మీ)
4. మియాపూర్-బీహెచ్ఈఎల్.. (4 కి.మీ)