ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడమే లక్ష్యం
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
అంబర్పేట, మే14: అంబర్పేట నియోజకవర్గంలో రూ.కోటితో అన్ని పార్కులను సుందరంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్పేట, బాగ్అంబర్పేట డివిజన్లలో ఉన్న పార్కుల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. బాగ్అంబర్పేట డివిజన్లోని సోమసుందర్నగర్ పార్కు అభివృద్ధి పనుల విషయమై కాలనీ అసోసియేషన్ ప్రతినిధులతో శనివారం ఎమ్మెల్యే పార్కు ఆవరణలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమసుందర్నగర్ పార్కు సుందరీకరణ పనులను త్వరలోనే చేపడతామన్నారు. కొత్త హంగులతో సరికొత్త విధంగా పార్కును ఆహ్లాదకరంగా మార్చనున్నట్లు పేర్కొన్నారు. అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి పార్కు మొత్తం పరిశీలించి వారికి కావాల్సిన విధంగా పార్కును తీర్చిదిద్దుతామని తెలిపారు.
వారికి అభివృద్ధి పనుల నమూనాను చూపించి పార్కులో చేస్తున్న పనులను స్వయంగా ఎమ్మెల్యే వివరించారు. ఈ పార్కు మాత్రమే కాకుండా డివిజన్లోని వాంబే కాలనీ పార్కు, వైభవ్నగర్, ఎస్బీహెచ్, ఇంద్రప్రస్త కాలనీ, సీఈ కాలనీ పార్కులను కూడా సుందరీకరిస్తున్నట్లు చెప్పారు. కాచిగూడ డివిజన్లోని విక్రంనగర్, హౌసింగ్ బోర్డుకాలనీ పార్కు, అంబర్పేట డివిజన్లోని అనంతరాంనగర్ కాలనీ పార్కు, నల్లకుంట డివిజన్లోని నరేంద్రపార్కు, తిలక్నగర్ పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వరి, సభ్యులు విక్రమ్, నాగమణి, చైతన్యరెడ్డి, మధుసూదన్రెడ్డి, రామలింగారెడ్డి, కార్తీక్రెడ్డి, సత్యవాణి, టీఆర్ఎస్ నాయకులు కెంచె మహేష్, దిలీప్, ఇ.ఎస్.ధనుంజయ పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు కల్యాణలక్ష్మి వరం
కాచిగూడ,మే 14: పేద,మధ్యతరగతి కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం ఓ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్లోని చెప్పల్బజార్కు చెందిన ధనలక్ష్మి కుటుంబానికి బీమాగౌని కృష్ణాగౌడ్ చొరవతో కల్యాణలక్ష్మి చెక్కును ఎమ్యెల్యే కార్యాలయంలో అందజేశారు. కార్యక్రమంలో కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేశ్యాదవ్, బి.కృష్ణాగౌడ్, రమేశ్యాదవ్, ధనలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.