బన్సీలాల్పేట్, జూలై 29 : నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బన్సీలాల్పేట్ డివిజన్లోని న్యూబోయిగూడ మార్గంలో ఫిలోమిన చర్చి మీదుగా కేటీఆర్ పార్క్ వరకు రూ. కోటి 32 లక్షలతో ఏర్పాటు చేయనున్న వీడీసీసీ రోడ్డు నిర్మాణ పనులను కార్పొరేటర్ హేమలత, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీసీ ముకుందరెడ్డి, జలమండలి జీఎం రమణారెడ్డిలతో కలిసి ఆయన ప్రారంభించారు.
మొదటి దశలో మల్లికార్జుస్వామి దేవాలయం వద్ద నుంచి మేకలమండి మీదుగా ఉప్పలమ్మ ఆలయం వరకు రోడ్డు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఎన్నో ఏండ్లుగా శిథిలావస్థలో ఉన్న రోడ్డు ఇప్పుడు అద్భుతంగా మారిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. దానికి కొనసాగింపుగా ప్రస్తుతం మిగిలిన భాగంలో రోడ్డు నిర్మాణం మొదలుపెడుతున్నామని అన్నారు. అన్ని కాలనీలు, బస్తీల్లో ఇప్పటికే సీవరేజీ, తాగునీటి పైప్లైన్ ఏర్పాటు పనుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశామని తెలిపారు.
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం చూపించామన్నారు. అనంతరం ఉప్పలమ్మ దేవాలయం పరిసరాలలో పర్యటించగా మ్యాన్ హోల్ నుంచి మురుగునీరు పొంగిపొర్లుతుండడంతో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడాలని జలమండలి అధికారులను ఆదేశించారు. రహదారుల పక్కన చెత్త కుప్పలను ఎప్పటికప్పుడే తొలగించాలని సూచించారు.
పారిశుధ్య నిర్వహణలో బల్దియాకు ప్రజలు సహకరించాలని కోరారు. తమ బస్తీలో కొందరు ఆకతాయిలు మద్యం తాగి మహిళలను వేధిస్తున్నారని మంత్రికి ఫిర్యాదు చేయగా, పెట్రోలింగ్ నిర్వహించి ఆకతాయిల ఆగడాలను అరికట్టాలని, అలాంటి వారిని ఎవరైనా ఉపేక్షించవద్దని గాంధీనగర్ ఇన్స్పెక్టర్కు ఆదేశించారు.
టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్ రాజు, కార్యదర్శి రాజేందర్, నాయకులు లక్ష్మీపతి, ఏసూరి మహేశ్, కమల్కుమార్, ప్రేమ్కుమార్, గజ్జెలశ్రీను, వెంకట్, రమణ, లంబుశ్రీను, రజాక్, ఫహీమ్, జావెద్, అబ్బాస్, ముక్కశ్రీను, శ్రీకాంత్రెడ్డి, అమృత, లక్ష్మి, అంబిక, నాగలక్ష్మి, దుర్గ, మహేశ్, కల్యాణ్రామ్, కీస్ బ్లాక్స్ అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి విజయ్, ఫిలోమిన చర్చి పాస్టర్ ఫాదర్ ప్రతాప్, అధ్యక్షుడు జయరాజ్ పాల్గొన్నారు.