ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలు వచ్చే నెల 5న ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ చాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్య అతిథిగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ హాజరుకానున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు ఓయూ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనున్నది.
ఈ వేడుకల్లో 2020 జూన్ నుంచి 2021 జూలై వరకు స్వర్ణ పతకాలు, పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి వాటిని ప్రదానం చేయనున్నారు. కానీ, ఈ వేడుకల్లో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన వారికి మాత్రమే వాటిని ప్రదానం చేయనున్నారు. వైస్ చాన్స్లర్ ప్రొఫెసర్ రవీందర్ వర్సిటీ నివేదికను సమర్పిస్తారు. అనంతరం గవర్నర్, ముఖ్య అతిథులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వివరాలకు ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ www.osmania.ac.in లో చూడవచ్చని అధికారులు తెలిపారు.
ప్రతి స్నాతకోత్సవంలో గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేయరు. 1917 నుంచి ఇప్పటివరకు కేవలం 47 మందికి మాత్రమే ఓయూ గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేసింది. చివరిసారిగా 2001లో అమెరికాలో స్థిరపడిన కంప్యూటర్ ఇంజినీర్, బెల్ లేబరేటరీస్ అధినేత డాక్టర్ అరుణ్ నేత్రావళికి డాక్టర్ ఆఫ్ సైన్స్ అందించింది.
స్వర్ణ పతకాలు, ఎంఫిల్, పీహెచ్డీ పట్టాలు సాధించిన అభ్యర్థులు స్నాతకోత్సవానికి రెండు రోజుల ముందుగా ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కార్యాలయంలో సంప్రదించి గుర్తింపు కార్డులు, ఆహ్వాన పత్రాలు పొందాలని అధికారులు సూచించారు. పట్టాలు పొందే ప్రతి ఒక్కరూ విధిగా తెలుపు దుస్తులు ధరించాలని చెప్పారు. స్నాతకోత్సవ సాంప్రదాయం ప్రకారం అలా వచ్చిన వారిని మాత్రమే అనుమతిస్తామని, గుర్తింపు కార్డులు వెంట కచ్చితంగా తెచ్చుకోవాలని తెలిపారు.
స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా పీజీ, పీహెచ్డీలో స్వర్ణ పతకాలు సాధించిన 55 మందికి వాటిని ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు దాదాపు రెండు వందల మందికి పీహెచ్డీ పట్టాలు అందించనున్నారు. యూజీలో స్వర్ణ పతకాలు సాధించిన వారికి వారి వారి కళాశాలలకు పతకాలను పంపిస్తారు.
భారత దేశ సర్వోన్నత న్యాయమూర్తి, తెలుగు కెరటం జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు అరుదైన గౌరవం దక్కనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ అందించే గౌరవ డాక్టరేట్లు అందుకున్న ప్రముఖుల జాబితాలో సీజేఐ చేరనున్నారు. తెలుగు రాష్ర్టాల నుంచి దేశ ప్రధాన న్యాయమూర్తి పదవిని అధిరోహించిన రెండో వ్యక్తిగా ఘనత వహించిన జస్టిస్ ఎన్వీ రమణకు ఉస్మానియా యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని అధికారులు నిర్ణయించారు. గత 21 ఏండ్లుగా ఏ ఒక్కరికీ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయలేదు. శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్నాతకోత్సవంలోనూ ఎవరికీ గౌరవ డాక్టరేట్ అందించలేదు.