హైదరాబాద్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేల బోనాల(Bonalu) పండుగను వైభవంగా నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి(Indrakaran Reddy), తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు. బోనాల ఏర్పాట్లు, నిర్వహణపై సచివాలయంలో శనివారం అధికారులతో సమీక్ష(Review) నిర్వహించారు.
మంత్రులు మాట్లాడుతూ తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగను సీఎం కేసీఆర్(CM KCR) రాష్ట్ర పండుగగా ప్రకటించి, తొమ్మిదేళ్లుగా ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. బోనాల ఉత్సవాలకు ఈ ఏడాది రూ.15 కోట్లు కేటాయించారని, ఆ నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం డిప్యూటీ స్పీకర్, మంత్రులు, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మేయర్, డిప్యూటీ మేయర్, తదితరులు 26 దేవాలయాల్లో ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.
జూలై 9న సికింద్రాబాద్ మహాంకాళి బోనాలు, 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నట్లు వివరించారు. బోనాల ఉత్సవాలకు వారం రోజుల ముందే ఆలయాల్లో బోనాల ఏర్పాట్ల కోసం ప్రత్యేక ఆర్థిక సహాయం చెక్లు అందజేయాలని అధికారులకు సూచించారు.బోనాలకు వచ్చే భక్తుల కోసం ఆలయ కమిటీలు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. ఆలయాల వద్ద క్యూలైన్లు, నీటి సౌకర్యం కల్పించాలన్నారు. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పలు ఆలయాల వద్ద ప్రత్యేకంగా స్టేజీలు ఏర్పాటు చేసి కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ అమయ్ కుమార్, దేవాదాయ, పర్యాటక, సమాచార, ఇతర అధికారులు పాల్గొన్నారు.
మహంకాళి బోనాలకు హాజరుకావాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఆహ్వానం
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే బోనాల మహోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ మేరకు మంత్రి తలసాని నేతృత్వంలో ఆలయ కమిటీ, ఆలయ కార్యనిర్వహణాధికారి, అర్చకులు మంత్రికి ఆహ్వాన పత్రికను అందజేశారు.