కవాడిగూడ, ఫిబ్రవరి 25: దేశవ్యాప్తంగా ఉన్న హస్త కళాకారులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో పదిరోజుల పాటు సాగనున్న హునర్ హాట్ (హస్తకళా వస్తువుల బజార్) ప్రారంభమైంది. మార్చి 6 వరకు సాగే ఈ హస్తకళా ప్రదర్శన ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగనున్నది. 29 రాష్ర్టాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన హస్త కళాకారులు తయారు చేసిన క్రాఫ్ట్, ఉడెన్వర్క్స్, బెనారస్ చీరలు, ఐరన్, రాట్, స్టోన్స్, ఆర్గానిక్ డ్రై ఫ్లవర్స్, బీట్, ఆర్టిఫిషియల్ జువెల్లరీ ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. అదే విధంగా ఇండియా గేట్, డంఖా, చెత్రీల చెట్టు, లేగ దూడలు, జంతువుల విగ్రహాలు, రకరకాల ఫర్నిచర్, ఇత్తడి, రాగితో తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో పాటు కార్పెట్లు, దుస్తులు ఇక్కడ కొలువు దీరాయి. ఈ హస్తకళా సందర్శనకు ఎలాంటి రుసుం లేదు.
హస్తకళా ప్రదర్శనలో దాదాపు 300 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 250 క్రాఫ్ట్ స్టాళ్లు, 50 ఫుడ్కోర్టులు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 39, 126, 246 స్టాళ్లలో తెలంగాణకు ప్రత్యేకమైన హైదరాబాద్ బిర్యానీ, చికెన్ టిక్కా, ఫ్రైడ్ చికెన్తో పాటు
లెదర్, ముత్యాలు, బిడ్ తయారీని ప్రదర్శనకు పెట్టారు. మరోవైపు ప్రతిరోజు రాత్రి 8 నుంచి 10 గంటల వరకు ప్రముఖ గాయకులు అల్తాఫ్ రాజా, సురేశ్ పాడేకర్, మహాలక్ష్మి అయ్యర్, సుధేశ్ భోస్లే, గజల్ సింగర్ పంకజ్ ఉదాస్, పబ్సీవాడే తమ గానంతో సందర్శకులను ఉర్రూతలూగించనున్నారు.