సిటీబ్యూరో, మే15 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ పేరు వింటేనే.. జనాల్లో ఏదో తెలియని వణుకు. అది ఎక్కడ ఏ రూపంలో విరుచుకుపడుతుందోనన్న భయం. ఈ నేపథ్యంలో ప్రజల్లో పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన పెరిగింది. మరోవైపు కొవిడ్ స్వల్ప, మధ్యస్త లక్షణాలు ఉన్న వారు హోం క్వారంటైన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
ఆ సమయంలో విడిగా ఉంటున్నా… కుటుంబ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావిస్తూ ఇంటిని శానిటైజేషన్ చేయించుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. వివిధ కార్యాలయాలు, వైద్యశాలల నిర్వాహకులు సైతం ఇదే విధానాన్ని అవలంబిస్తున్నారు. దీంతో ఈ తరహా సేవలు అందించే సంస్థలకు విపరీతంగా డిమాండ్ పెరుగుతున్నది. ఇప్పుడు పెస్ట్ హోం సర్వీస్ సంస్థలు కూడా ఈ సేవలందిస్తున్నాయి.
పెస్ట్ కంట్రోల్ సంస్థలు నిర్ధిష్ట ప్రమాణాలతో సర్వీసులు అందిస్తున్నాయి. గృహాల్లోని గదులు, వస్తువులతో పాటు గ్రానైట్, మార్బుల్ ఫ్లోర్ లాంటి వాటిని పరిగణలోకి తీసుకొని రసాయనాలు వినియోగిస్తారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలతో ఇంట్లోని చిన్నపిల్లలు, పెద్దలు ఎవరికీ ఎలాంటి హాని కలుగని రసాయనాలతో మాత్రమే శానిటైజ్ చేస్తున్నారు. కొందరు కెమికల్స్ కాకుండా ఇంటి యజమానుల అభిరుచి మేరకు ఎకో ఫ్రెండ్లీ పద్ధతుల్లోనే శానిటైజ్ చేస్తుండడం విశేషం. ముఖ్యంగా స్టీమ్ శానిటైజేషన్లో వేడి నీటి ఆవిరిని ఇంట్లోని పరిసరాలు, ఫ్లోర్, ఫర్నిచర్, ఇతర వస్తువులపై పిచికారీ చేసి వాటిని శుద్ధి చేస్తారు. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు.
గృహ యజమానుల ఆసక్తిని బట్టి ధరలను నిర్ణయించారు. 1 బీహెచ్కేకు రూ.800, 2 బీహెచ్కేకు రూ.1,200, 3బీహెచ్కేకు రూ.1,800 రేటు ఉంటుంది. మరికొన్ని హోం సర్వీస్ సంస్థలు రూ.2 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఇక దవాఖానలు, విల్లాలు, అపార్టుమెంట్లు, కార్యాలయాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో వాటి విస్తీర్ణాన్ని పరిశీలించి ధరలను నిర్ణయిస్తారు.
మా సంస్థ 15 ఏండ్లుగా హోం సర్వీసెస్ను నిర్వహిస్తున్నది. పెస్ట్ కంట్రోల్, యాంటీ వైరస్ డిస్ఇన్ఫెక్షన్కు సంబంధించి శానిటైజేషన్తో పాటు ఫ్లోర్ క్లీనింగ్ పనులను కూడా చేస్తున్నాం. కొవిడ్ నేపథ్యంలో మా సర్వీసులకు ఆదరణ పెరిగింది. ముఖ్యంగా హోం క్వారంటైన్లో ఉన్నవారు, తమ సమీప గృహాల్లో ఎవరైనా కరోనా బాధితులు ఉంటే శానిటైజేషన్ చేయించుకుంటున్నారు. – బిందు హరీశ్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, విజయ హోం సర్వీసెస్