బొల్లారం, నవంబర్ 8 : వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎంతో ప్రఖ్యాతి పొందుతోందని, రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇక్కడ అభివృద్ధి ఘణనీయంగా ఉందని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. సోమవారం సికింద్రాబాద్ లోని జింఖానా మైదానంలో ఏర్పాటు చేసిన వింటర్ ఉత్సవ్ మేళా ప్రదర్శనను స్థానిక ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ ఫారుఖ్హుస్సేన్లతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని ప్రధాన నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటుందని, ఇక్కడికి ఇతర ప్రాంతాల నుంచి వ్యాపార సంస్థలు, పారిశ్రామిక వేత్తలు వచ్చి వ్యాపారాలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు.
అందుకు రాష్ట్ర ప్రభుత్వం తగినంత ప్రోత్సాహం అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా వచ్చి తిలకించేందుకు ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృషితో నగరం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. నిర్వాహకులు రఫీక్ బేగ్ మాట్లాడుతూ.. చేనేత హాస్తకళలతో పాటు కాశ్మీరీ డ్రైప్రూట్స్, రాజస్థాన్ హాండ్లూమ్స్, రాజస్థాన్ వస్ర్తాలతో పాటు గృహోపకరణాలు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 200 స్టాళ్లతో ప్రదర్శన ఏర్పాటు చేశామని ముఖ్యంగా రోబోటిక్ అనిమల్స్ ప్రదర్శన పిల్లలను ఆకట్టుకుంటుందన్నారు. కార్యక్రమంలో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, ముప్పిడి గోపాల్ పాల్గొన్నారు.