సుల్తాన్బజార్,మే 27 : కరోనా కట్టడి, మరోవైపు బ్లాక్ ఫంగస్ చికిత్సకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేష్ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి ప్రశంసించారు. గురువారం కోఠిలోని ప్రభుత్వ ఈఎన్టీ దవాఖానను ఆయన సందర్శించారు. ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న బ్లాక్ ఫంగస్ సోకిన రోగులను పరామర్శించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయని ప్రశ్నించగా.. బాగానే అందుతున్నాయ్ సార్ అని రోగులు సమాధానమిచ్చారు. దవాఖానలో చికిత్స పొందుతున్న వారి వివరాలు, వారికందుతున్న సేవలు, అందుబాటులో ఉన్న వసతుల గురించి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్ను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడుతూ కరోనా బారిన పడకుండా ఉంటే బ్లాక్ ఫంగస్ దరిచేరదని, ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. బ్లాక్ ఫంగస్ బాధితులకు మెరుగైన చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈఎన్టీ దవాఖానను నోడల్ కేంద్రంగా మార్చడం అభినందనీయమన్నారు. కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశేషంగా కృషి చేస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరికీ టీకాలు ఇవ్వాలనే లక్ష్యంతో 16 కంపెనీల్లో టీకాల ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. మంత్రి వెంట ఆర్ఎంవో డాక్టర్ జయమనోహరి, పీఆర్వో డాక్టర్ మనీశ్కుమార్ గుప్త, డాక్టర్ సంపత్కుమార్ సింగ్ ఉన్నారు.
కరోనా, బ్లాక్ ఫంగస్ బారిన పడి దవాఖానలో ఉన్న నిరుపేదలకు సహాయమందించేందుకు స్వచ్ఛం ద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. కోఠి ఈఎన్టీ దవాఖానను బ్లాక్ ఫంగస్ నోడల్ కేంద్రంగా ప్రకటించిన నాటి నుంచి లయన్స్క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ ఆధ్వర్యంలో వలంటీర్లుగా సేవలందిస్తూనే 250 మందికి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నారు. వీరి సేవలు తెలుసుకొని లయన్స్క్లబ్ ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కమల్ కిశోర్ అగర్వాల్, అధ్యక్షుడు హర్బీందర్సింగ్ను మంత్రి అభినందించారు.