సిటీబ్యూరో, అక్టోబర్ 8(నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డు లోపల అత్యంత మెరుగైన రోడ్డు నెట్వర్క్ను నిర్మించడమే లక్ష్యంగా చేసుకొని హెచ్ఎండీఏ శివారు ప్రాంతాల్లో కొత్తగా రోడ్లను నిర్మిస్తోంది. ముఖ్యంగా నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు నుంచి గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఔటర్ రింగు రోడ్డును కలుపుతూ పలు ప్రాంతాల్లో ఇప్పటికే రేడియల్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. హైదరాబాద్ మహానగరం అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మాస్టర్ప్లాన్లో పొందుపర్చిన 33 రేడియల్ రోడ్లను దశల వారీగా నిర్మించగా, శివార్లలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో రేడియల్ రోడ్లను అనుసంధానిస్తూ కొత్త రోడ్లను హెచ్ఎండీఏ నిర్మిస్తోంది. ఇందులో భాగంగా బాలానగర్లోని నర్సాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి జీడిమెట్ల, సూరారం మీదుగా దుండిగల్ ఓఆర్ఆర్ వరకు రేడియల్ రోడ్డుకు ఇరువైపులా రెండు చోట్ల విస్తరణ పనులను హెచ్ఎండీఏ చేపట్టింది. ఇందులో మొదటగా నాగ్పూర్ జాతీయ రహదారిపై ఉన్న కొంపల్లి నుంచి బహదూర్పల్లి మీదుగా సూరారం వరకు, అలాగే గండిమైసమ్మ చౌరస్తా నుంచి మియాపూర్ వరకు ఉన్న రోడ్డు మార్గంలో బాచుపల్లి-నిజాంపేట సర్కిల్ నుంచి మల్లంపేట ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వరకు మొత్తం రూ.205 కోట్లతో విశాలమైన రహదారులను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ పనులు పురోగతిలో ఉన్నాయి. నగరానికి ఉత్తర భాగంలో రోజు రోజుకు పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో రోడ్ల విస్తరణ పనులు, జాతీయ రహదారులు, రేడియల్ రోడ్లతో అనుసంధానం చేస్తోంది.
తెల్లాపూర్ నుంచి శంకర్పల్లి వరకు..
జీహెచ్ఎంసీ పరిధి తర్వాత ఉన్న శివారు మున్సిపాలిటీల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వాటిలో నిజాంపేట, కొంపల్లి, దుండిగల్, అమీన్పూర్ మున్సిపాలిటీతో పాటు ఐటీ కారిడార్ వైపు తెల్లాపూర్, నార్సింగి, మణికొండ మున్సిపాలిటీల్లో కొత్త రోడ్లను నిర్మించేందుకు హెచ్ఎండీఏ అధిక మొత్తంలో నిధులను కేటాయిస్తోంది. దీంతో పాటు ఆర్ అండ్ బీ, టీఎస్ఐఐసీ, హెచ్ఆర్డీసీఎల్లు లింకు రోడ్ల నిర్మాణం పనులు చేపడుతున్నారు. ఇందులో అత్యంత కీలకమైంది. తెల్లాపూర్ నుంచి శంకర్పల్లి వరకు నిర్మించిన రేడియల్ రోడ్డు. మొదట తెల్లాపూర్ వరకు ఉన్న ఈ రోడ్డును స్థానికంగా పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో పెట్టుకొని లింగంపల్లి నుంచి తెల్లాపూర్ మీదుగా ఈదులనాగులపల్లి, కొండకల్ మీదుగా ఉన్న రైల్వే ట్రాక్ లోపలి వైపు రేడియల్ రోడ్డును నిర్మించారు. ప్రస్తుతం ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. దీంతో మరో రేడియల్ రోడ్డును విప్రో సర్కిల్ నుంచి గౌలిదొడ్డి, గోపన్పల్లి, తెల్లాపూర్, ఉస్మాన్నగర్ మీదుగా కొల్లూరు వరకు రేడియల్ రోడ్డును నిర్మించారు. దీనికి అనుసంధానంగా గోపన్పల్లి నుంచి వట్టినాగులపల్లి వైపు, అలాగే నల్లగండ్ల మీదుగా శేరిలింగంపల్లి రేడియల్ రోడ్లను విస్తరిస్తూ నిర్మాణం పనులు చేపట్టారు.
తూర్పున సైతం మరో లింకు రోడ్డు..
నగరానికి ఉత్తర, పడమర దిక్కుల్లోనే కాకుండా తూర్పు వైపున సైతం ఇన్నర్ రింగు రోడ్డు, ఔటర్ రింగు రోడ్డు మధ్య కొత్తగా లింకు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే నాగోల్ ఇన్నర్ రింగు రోడ్డు నుంచి గౌరెల్లి వరకు ఉన్న రేడియల్ రోడ్డుకు అనుసంధానంగా నాగోల్ జీఎస్ఐ నుంచి ఫతుల్లాగూడ మీదుగా మూసీ, ఉప్పల్ భగాయత్ వైపు పీర్జాదిగూడ ప్రధాన రహదారి వరకు కొత్తగా లింకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ మార్గంలో ఫతుల్లాగూడ వరకు 100 అడుగుల రోడ్డు నిర్మాణం పూర్తి కాగా, మూసీనది పై ఉప్పల్ భగాయత్ వద్ద హైలెవల్ బ్రిడ్జీ నిర్మాణానికి ఇటీవలే మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ లింకు రోడ్డు నిర్మాణం పూర్తయితే విజయవాడ జాతీయ రహదారి నుంచి వరంగల్ జాతీయ రహదారికి మధ్య అత్యంత అనుకూలమైన లింకు రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుం ది. కొత్తగా లింకు రోడ్ల నిర్మాణం వల్ల చుట్టు పక్కల ప్రాంతాల్లో పట్టణీకరణ మరింత వేగంగా చోటు చేసుకుంటోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రధాన రహదారులకు ప్రత్యామ్నాయంగా లింకు రోడ్లను అభివృద్ధి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఇప్పటి వరకు 137కు పైగా లింకు రోడ్ల నిర్మాణం పనులను చేపట్టింది. ఇంకా ఎక్కడ అవసరమో గుర్తించి, అక్కడ క్షేత్ర స్థాయిలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏతో పాటు స్థానిక మున్సిపాలిటీ అధికారులతో కలిసి లింకు రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. పెరుగుతున్న ట్రాఫిక్కు అనుగుణంగా మెరుగైన రోడ్ నెట్వర్క్ను కల్పించేందుకు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం వెచ్చిస్తోంది. లింకు రోడ్ల ద్వారా ప్రధాన రహదారులపై ట్రాఫిక్కు భారీగా ఊరట కలగడంతో పాటు ఎంతో విలువైన సమయం, ఇంధనం సైతం ఆదా కానుంది.