Paigah Palace | సిటీబ్యూరో, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): చారిత్రాత్మక వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన బేగంపేట పైగా ప్యాలెస్ను హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయంగా మార్చే ప్రక్రియ మొదలైంది. హెచ్ఎండీఏ కార్యకలాపాలన్నీ ఒకే చోట నుంచి జరిగేలా చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోను జారీ చేసింది. ప్రస్తుతం హెచ్ఎండీఏకు సంబంధించిన కార్యకలాపాలు అమీర్పేట, నానక్రాంగూడ, హుస్సేన్సాగర్ లుంబినీ పార్కు ప్రాంతాల నుంచి జరుగుతున్నాయి. వీటన్నింటినీ బేగంపేటలోని పైగా ప్యాలెస్లోకి మార్చేందుకు హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.
వారం రోజులుగా పైగా ప్యాలెస్లో ఉన్న భవనాలు, అక్కడ ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను పరిశీలిస్తున్నారు. ఎలక్ట్రిక్ విభాగంతో పాటు ఐటీ, నెట్వర్కింగ్కు సంబంధించిన ఉద్యోగులు అక్కడి భవనాల్లో ఉన్న వనరులను గుర్తించే పనిలో ఉన్నారు. సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్ఎండీఏకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు ఒకే చోట నుంచి జరిగేలా అవసరమైన మౌలిక వసతులను కల్పించనున్నారు.
ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన ప్రత్యేకంగా జీవోను సైతం జారీ చేయడంతో అధికారులు ఈ నెలాఖరు వరకు అందులో ఆఫీసు నిర్వహణకు అవసరమైన ఫర్నిచర్, వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారుల చాంబర్లు, వాటికి అవసరమైన మౌలిక వసతులపై నివేదికను రూపొందించనున్నారు. ఈ భవనం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానికి చెందినది కావడంతో దాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు ఎలాంటి అదనపు నిర్మాణాలు చేపట్టాలన్న దానిపైనా ఇంజినీరింగ్ విభాగం అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కాగా, ఆగస్టు నాటికి హెచ్ఎండీఏ కార్యాలయాల తరలింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.