Hyderabad | సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): ఐటీ కారిడార్లో ఎంతో విలువైన భూముల విక్రయానికి హెచ్ఎండీఏ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. నియోపోలిస్ పేరుతో కోకాపేటలో ఏర్పాటు చేసిన లే అవుట్లో 7 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నారు. హెచ్ఎండీఏ. కామ్ వెబ్సైట్ ద్వారా ప్లాట్ల కొనుగోలు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ వేలం, లే అవుట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం కోసం auctions. hmda. gov. in వెబ్సైట్లో చూడవచ్చు. ఈనెల 20న ప్రీ బిడ్ మీటింగ్, 31న రిజిస్ట్రేషన్కు చివరి తేదీగా నిర్ణయించారు. అదేవిధంగా ఈఎండీ చెల్లింపు కోసం ఆగస్టు 1ని నిర్ణయించి, ఆగస్టు 3న రెండు సెషన్లలో 7 ప్లాట్లను విక్రయించనున్నారు. ఒక్కో ప్లాటు సైజు కనిష్ఠంగా 3.60 ఎకరాలు ఉండగా, గరిష్ఠం 9.71 ఎకరాల వరకు ఉంది. మొత్తం 7 ప్లాట్లు కలిపి 45.33 ఎకరాలు ఉంటుంది. వేలంలో ఉంచిన భూమి ఎకరం ధర మినీమం ఆఫ్సెట్ ధర రూ. 35 కోట్లుగా నిర్ణయించారు. కోకాపేటలో అభివృద్ధి చేసిన లే అవుట్ కోసం హెచ్ఎండీఏ సుమారు రూ. 300 కోట్ల రూపాయలను వెచ్చించి అంతర్జాతీయ ప్రమాణాలతో రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, ఇతర మౌలిక వసతులను కల్పిస్తున్నది. సుమారు 41 ఎకరాలను రకరకాల వసతుల కోసమే కేటాయించారు. లేఅవుట్లోని రోడ్లన్నీ 45 మీటర్ల వెడల్పుతో 8 లేన్ల రహదారి, 36 మీటర్ల వెడల్పుతో 6 లేన్ల రహదారుల నిర్మాణాన్ని చేపట్టారు.
ఈ-వేలం షెడ్యూలు..
7న మోకిల, 8న షాబాద్లో..
శంషాబాద్-షాబాద్ల మధ్య వేలాది ఎకరాల్లో ఏర్పాటు చేసిన చందన్వెల్లి ఇండస్ట్రియల్ కారిడార్ సమీపంలో సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ భారీ లేఅవుట్ అభివృద్ధి చేసింది. ఇందులో మొదటి దశలో 50 ప్లాట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు నోటిఫికేషన్ను జారీ చేసింది. ఒక్కో ప్లాటు సైజు 300 చదరపు గజాలు ఉంటుందని, ఈనెల 22న ప్రీ బిడ్ సమావేశం ఉదయం 11 గంటలకు షాబాద్లోని లేఅవుట్లోనే ఉంటుందని, రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఆగస్టు 4, ఈఎండీ చెల్లించేందుకు 5వ తేదీని గడువు విధించగా, ఆగస్టు 8న రెండు సెషన్లలో 25 ప్లాట్ల చొప్పున ఆన్లైన్ వేలం ఉంటుందని, లేఅవుట్ ప్లాట్ల సమాచారం కోసం 8125859010 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
మోకిలలో 50 ప్లాట్లకు ఆన్లైన్ వేలం…
హైదరాబాద్-శంకర్పల్లి మార్గంలో ఉన్న మోకిలలో హెచ్ఎండీఏ లేఅవుట్ను అభివృద్ధి చేసింది. ఇందులో 50 ప్లాట్లను మొదటి విడతలో విక్రయించనున్నారు. ఒక్కో ప్లాటు విస్తర్ణం 325 చదరపు గజాల నుంచి 433 వరకు ఉంటుంది. ప్రీ బిడ్ మీటింగ్ను ఈనెల 21న లే అవుట్లో ఉదయం 11 గంటలకు ఉంటుంది. చదరపు గజానికి కనీస ధరను రూ.25000/లుగా నిర్ణయించగా, వేలంలో పాల్గొన్న వారు గజానికి రూ. 500 చొప్పున పెంచాల్సి ఉంటుంది. ఒక్కో ప్లాటుకు ఈఎండీ రూపంలో రూ. లక్ష చెల్లించాలి. ప్లాట్లను ఆన్లైన్ వేలం ద్వారా కొనుగోలు చేసేందుకు ఆగస్టు 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 5న ఈఎండీ చెల్లించాల్సి ఉంటుందని, అనంతరం ఆగస్టు 7న రెండు సెషన్లలో 25 ప్లాట్ల చొప్పున వేలం ఉంటుందని అధికారులు తెలిపారు.