సిటీబ్యూరో, జనవరి 10 (నమస్తే తెలంగాణ): రాజస్థాన్ నుంచి హెరాయిన్ తెచ్చి.. నగరంలో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తితో పాటు మరో జువైనల్ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేశారు. వారివద్దనుంచి రూ. 50 లక్షల విలువైన 80 గ్రాముల డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ సీపీ సుధీర్బాబు బుధవారం నేరేడ్మెట్లోని కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
రాజస్థాన్లోని జాలోర్ జిల్లాకు చెందిన అశోక్కుమార్ హైదరాబాద్లోని లంగర్హౌస్లో నివాసముంటూ బీ ఫార్మసీ చదువుతున్నాడు. అతడికి రాజస్థాన్కు చెందిన మరో బాలుడు స్నేహితుడిగా మారాడు. వీరిద్దరు డ్రగ్స్కు అలవాటు పడ్డారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో డ్రగ్స్ విక్రయించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్లో ఒక డ్రగ్ స్మగ్లర్ను కలిశారు. అతడి నుంచి రూ. 5 వేల నుంచి రూ. 6 వేలకు గ్రాము చొప్పున డ్రగ్ కొని, దానిని హైదరాబాద్లో రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు విక్రయించాలని ప్లాన్ చేశారు.
రాజస్థాన్ నుంచి డ్రగ్స్ను ప్రైవేట్ ట్రావెల్ బస్సుల్లో దుస్తుల చాటున రవాణా చేస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్బీనగర్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సుధాకర్ బృందం, హయత్నగర్ పోలీసులతో కలిసి హయత్నగర్లోని సత్య పార్కింగ్ యార్డ్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 80 గ్రాముల హెరాయిన్ దొరికింది. దీంతో ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ సమావేశంలో ఎల్బీనగర్, మహేశ్వరం జోన్ల ఎస్ఓటీ డీసీపీ కె.మురళీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు.