ద్విచక్రవాహనంపై వెనుకాల కూర్చున్నవారు ఎవరో పరాయివారు కాదు.. వారూ మీ ఆత్మీయులే… మీ కుటుంబ సభ్యులే… మీ ఒక్కరి రక్షణే ముఖ్యం కాదు.. వారి ప్రాణమూ విలువైనదే.. ఇద్దరూ సురక్షితంగా గమ్యానికి చేరినప్పుడే.. ఆ ప్రయాణానికి అర్థవంతమైన ముగింపు ఉంటుంది
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదివే సతీశ్, సాగర్ ఇద్దరూ ప్రాణస్నేహితులు. నగరంలోనే జరిగిన మిత్రుడి పెళ్లికి బైక్పై వెళ్లి హుషారుగా తిరిగి వస్తుండగా, ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. సతీశ్ కండ్లు తెరిచి చూసేసరికి దవాఖానలో ఉండగా, వెనుక కూర్చున్న మిత్రుడు సాగర్ కానరానిలోకాలకు వెళ్లిపోయాడు.
పండుగకు ఊరెళ్లిన భార్యను నగరానికి బైక్పై తీసుకొస్తున్న భాస్కర్కు రోడ్డుపై ఉన్న గుంత కనిపించలేదు. బైక్ అదుపు తప్పి ప్రమాదం జరిగింది. అప్పటి వరకు కబుర్లు చెప్పిన అర్ధాంగి కండ్ల ముందే అనంతలోకాలకు వెళ్లిపోయింది..
ఈ రెండు ఘటనలూ ప్రమాదాలే.. కానీ వీటికి పోలికలున్నాయి. రెండు ఘటనల్లోనూ డ్రైవింగ్ చేసే వారు కాకుండా, వెనుక కూర్చున్న వారు మాత్రమే మృతి చెందారు. కారణం.. వారు హెల్మెట్ పెట్టుకోకపోవడమే.
మీ ప్రయాణానికి సురక్షితమైన ముగింపు ఉండాలనే ప్రభుత్వం బైక్పై వెనుక కూర్చున్న వారికీ హెల్మెట్ తప్పనిసరి చేసింది. ఒక సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే ఈ మూడేండ్లలో వెనుకాల కూర్చున్న 274 మంది మృత్యువాత పడ్డారు. ప్రమాద సమయంలో తలకు తీవ్రమైన గాయాలు కావడంతో వారంతా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హెల్మెట్ ధరిస్తే ఆ 274మంది ప్రాణాలు నిలబడేవని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
ద్విచక్ర వాహనం కొనుగోలు సమయంలోనే షోరూమ్ నిర్వహకులు లేదా బైక్ తయారు చేసిన సంస్థలు కచ్చితంగా మోటర్ వెహికిల్ యాక్ట్ ప్రకారం వాహనదారుడికి రెండు హెల్మెట్లను ఇవ్వాల్సిందే. ఇలా ఇవ్వని వారిపై పోలీసులు లేదా వినియోగదారుల ఫోరమ్ లేదా ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు.
2019లో జరిగిన ప్రమాదాలను ట్రాఫిక్ అధికారులు క్షుణ్ణంగా విశ్లేషించారు. వారి అధ్యయనంలో ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున్న వారు 114 మంది చనిపోయారని తేలింది. వెనుకాల కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరిస్తే కొంతమంది ప్రాణాలైన నిలిచేవని భావించారు. అప్పటి నుంచి ద్విచక్రవాహనం వెనుకాల కూర్చున వారికీ హెల్మెట్ తప్పనిసరని, లేదంటే మోటర్ వెహికిల్ యాక్ట్ కింద నేరమని అవగాహన కల్పించారు. నిబంధనలు పట్టించుకోని వారికి చలాన్లను విధిస్తున్నారు. ఈ చలాన్లపై వాహనదారులు మొదట చాలా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్రాఫిక్ అధికారులపై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్ర్తాలు, ఆరోపణలను సంధించారు. అయినా పోలీసులు ప్రజల ప్రాణాలే ముఖ్యమని వెనుకడుగు వేయలేదు. దీంతో 2020లో 2019లో జరిగిన వాటి కంటే 21 మరణాలు తగ్గాయి. ప్రజల్లో అవగాహన పెరుగడంతో 2021 సంవత్సరానికి వచ్చే సరికి మరణాల సంఖ్య మరింత తగ్గింది.