కుత్బుల్లాపూర్, ఆగస్టు 26: ఓ దొంగ ఏకంగా కొరియర్ బాయ్గా వచ్చి, ఓ మహిళ మెడపై కత్తిపెట్టి బెదిరించి చోరీకి యత్నించిన ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసు లు తెలిపిన ప్రకారం, జీడిమెట్ల డివిజన్ పేట్ బషీరాబాద్లోని వుడ్స్ కాలనీలో గుర్తు తెలియని వ్యక్తి ముఖానికి మాస్కు చుట్టుకొని ఓ ఇంట్లో కొరియర్ అంటూ కాలింగ్ బెల్ నొక్కాడు. వెంటనే
ఆ ఇంట్లో యజమానురాలు ఫోన్ లో మాట్లాడుకుంటూ తలుపులు తీయగా, అప్పటికే చేతి లో కత్తితో సిద్ధంగా ఉన్న దొంగ ఆమె గొంతుపై పెట్టి బెదిరింపులకు దిగాడు. దీంతో భయభ్రాంతులకు గురైన సదరు మహిళ తన వద్ద ఏం లేవంటూ మెడలో కేవలం పుస్తెలతాడు మాత్రమే ఉందని పెద్దగా కేకలు వేసింది. దీంతో అప్పటికే ఫోన్లైన్లో ఉన్న అవతలి వ్యక్తి ఇదంతతా వింటున్నాడని గుర్తించి దొంగ తన వెంట తెచ్చుకొన్న టేపును సదరు మహిళ నోటికి చుట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడి ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు చేపట్టారు.