సుల్తాన్బజార్,జూలై 1: కొవిడ్ సమయంలో వైద్యులు అందించిన సేవలు వెలకట్టలేనివని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. శనివారం తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోఠిలోని డీఎంఈ ఆడిటోరియంలో డాక్టర్ బీసీ రాయ్ జయంతిని పురస్కరించుకొని జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎర్రోళ్ల శ్రీనివాస్, ప్రభుత్వ వైద్యాధికారులతో కలిసి డాక్టర్ బీసీరాయ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో రాష్ట్రం ఆరోగ్య సేవల్లో దేశంలోనే మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. మొదటి స్థానం సాధించే దిశగా ప్రభుత్వ వైద్యులు కృషి చేయాలని కోరారు. పబ్లిక్ హెల్త్ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కత్తి జనార్దన్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూర్ణ చందర్ మాట్లాడుతూ… పబ్లిక్ హెల్త్ డాక్టర్లందరూ సమయ పాలన పాటిస్తూ పేద ప్రజలకు అత్యున్నత స్థాయి వైద్యం అందించాలని కోరారు. ప్రతి యేడాది జూలై 1న ప్రభుత్వం అధికారికంగా డాక్టర్స్ డేను నిర్వహించాలని కోరారు. మారుమూల గ్రామాలలో పనిచేస్తున్న వైద్యులకు వెహికల్ అలవెన్స్ కల్పించాలని, టైం బాండ్ ప్రమోషన్లు కల్పించాలన్నారు. పల్లె దవాఖానల్లో పని చేస్తున్న డాక్టర్లకు బస్తీ దవాఖాన డాక్టర్ల తరహాలో 52 వేల జీతం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన వైద్యాధికారులు, వైద్యులను జ్ఞాపికలు అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీవీవీపీ కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్, ఎన్హెచ్ఎం జాయింట్ డైరెక్టర్ డాక్టర్ స్వరాజ్యలక్ష్మి, నీలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి,మేడ్చల్ డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాస్,నాగర్ కర్నూల్ డీఎంహెచ్వో డాక్టర్ సుధాకర్, ఆదిలాబాద్ డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్, రంగారెడ్డి డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్లుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీపీహెచ్డీఏ జిల్లా యూనిట్ నాయకులతో పాటు పబ్లిక్ హెల్త్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.