Hyderabad | బంజారాహిల్స్ : పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమానికి ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో మద్యం మత్తులో ఉన్న పెళ్లికొడుకు ఇతరులతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఇదేమిటని నిలదీసిన పెళ్లి కూతురు, ఆమె సోదరుడిపై దాడి చేసిన వరుడితో పాటు పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో అతడి కుటుంబసభ్యులపై జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న ఓ యువతి(24) కుటుంబసభ్యులతో ఇటీవల చిత్తూరుకు చెందిన తేజ స్వీట్స్ అధినేత, ప్రముఖ ఫైనాన్స్ వ్యాపారి ఏ.రవిబాబు కుటుంబ సభ్యులకు పరిచయం ఏర్పడింది. ఆయన కుమారుడు ఏ.వైష్ణవ్తో బాధిత యువతికి సంబంధం మాట్లాడుకున్న రవిబాబు కుటుంబసభ్యులు రూ.3కోట్లు వరకట్నంగా డిమాండ్ చేశారు. దీనికి అంగీకరించిన యువతి కుటుంబసభ్యులు గత ఏడాది సెప్టెంబర్లో తిరుపతిలోని తాజ్ హోటల్లో ఎంగేజ్మెంట్ ఏర్పాటు చేశారు. చివరి క్షణంలో ఎంగేజ్మెంట్ను రద్దు చేసిన వైష్ణవ్ కుటుంబ సభ్యులు మరో తేదీన ఎంగేజ్మెంట్ చేసుకుందామని చెప్పారు. దీంతో నవంబర్లో ఎంగేజ్మెంట్ చేసుకుందామని తెలిపారు. అయితే పలు కారణాలవల్ల ఎంగేజ్మెంట్ లేకుండా నేరుగా పెళ్లి చేద్దామని రెండు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి.
గత ఏడాది నవంబర్ 20న లగ్న పత్రిక రాసుకున్న సమయంలో పెళ్లికుమార్తె తండ్రి వైష్ణవ్కు డైమండ్ రింగ్, రోలెక్స్ వాచీ, బంగారు గొలుసు పెట్టారు. అలాగే వైష్ణవ్ కుటుంబసభ్యులు పెళ్లికుమార్తెకు నెక్లెస్ పెట్టారు. ఇదిలా ఉండగా ఫిబ్రవరి 9న డెస్టినేషన్ వెడ్డింగ్ నిర్వహించాలని పెళ్లికొడుకు కుటుంబసభ్యులు డిమాండ్ చేయడంతో మొయినాబాద్లోని బ్రౌన్ టౌన్ రిసార్ట్లో ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి 7నుంచి 10దాకా రిసార్ట్ను బుక్ చేయడంతో పాటు సుమారు రూ.50లక్షలతో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. కాగా పెళ్లికి ముందు నిర్వహించే సంగీత్ కార్యక్రమంలో పాల్గొనేందుకు డ్యాన్స్ రిహార్సల్స్ చేసేందుకు పెళ్లి కొడుకుతోపాటు అతడి బంధువులు, స్నేహితులు రిసార్ట్కు వచ్చారు. మహిళా కొరియోగ్రాఫర్తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వైష్ణవ్ ఆమెతో పాటు అక్కడున్న ఇతర మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న విషయాన్ని గుర్తించిన పెళ్లికూతురు నిలదీసింది.
అప్పటికే పీకలదాకా మద్యం సేవించిన వైష్ణవ్తో పాటు అతడి స్నేహితులు ఆమెను దుర్భాషలాడి దాడికి పాల్పడ్డారు. అక్కడే ఉన్న పెళ్లికూతురు సోదరుడు అడ్డుకునేందుకు యత్నించగా అతడిని చితకబాదారు. దీంతో మాటామాటా పెరగడంతో ఇరువర్గాల పెద్దలు రంగంలోకి దిగి సర్ది చెప్పేందుకు యత్నించినా ఫలితం దక్కలేదు. తన కళ్లముందే మద్యం సేవించడంతోపాటు డ్రగ్స్ తీసుకుని మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వైష్ణవ్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పెళ్లికూతురు చెప్పింది.
పెళ్లి ఏర్పాట్ల కోసం పెట్టిన రూ.50లక్షల ఖర్చుతో పాటు తాము పెట్టిన వస్తువులను తిరిగి ఇవ్వాలని కోరగా వాటిని ఇచ్చేందుకు అంగీకరించని వైష్ణవ్ తల్లిదండ్రులు ముఖం చాటేశారు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు, ఆభరణాలు ఇవ్వకపోగా బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ బాధిత యువతి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పెళ్లికొడుకు వైష్ణవ్తోపాటు కుటుంబసభ్యులు ఏ.రవిబాబు, దేవి, తేజు, శ్రవణ్తోపాటు స్నేహితులు శరత్రెడ్డి, మనోజ్, భరత్ తదితరుల పై ఐపీసీ 354, 324, 420, 506 సెక్షన్లతో పాటు వరకట్న వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.