బొల్లారం, డిసెంబర్ 17: దేశ రక్షణ వ్యవస్థలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజినీరింగ్ (ఎంసీఈఎంఈ) కీలక పాత్ర పోషిస్తున్నదని ఎంసీఈఎంఈ కమాండెంట్, లెఫ్టినెంట్ జనరల్ సిధానా అన్నారు. ఆదివారం తిరుమలగిరి ఎంసీఈఎంఈ ఆడిటోరియంలో 104వ స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనరల్ మనోజ్ పాండే (పీవీఎస్ఎమ్, ఏవీఎస్ఎమ్), రాయల్ భూటాన్ ఆర్మీ, శ్రీలంక ఆర్మీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీఈ 104 (టీఈఎస్-40) కోర్సులో శిక్షణ పూర్తి చేసుకున్న 33 మిలిటరీ అధికారులకు ఇంజినీరింగ్ పట్టాలను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు గోల్డ్, సిల్వర్ పతకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మిలిటరీ అధికారులు, ఎంసీఈఎంఈ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.