హైదరాబాద్, జులై 15(నమస్తే తెలంగాణ): ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మాష్యూటికల్ హబ్గా ఎదుగుతున్న హైదరాబాద్ నగరం కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలలోనూ ఎదగాలని గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర్ రాజన్ ఆకాంక్షించారు. ఈ దిశగా కృషి సాగాలన్నారు. ప్రాక్టికల్ ఓరియెంటెడ్, కేస్ స్టడీ పద్ధతులలో, ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పించడం ద్వారా విద్యార్థులను కామర్స్ బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలలో భవిష్యత్తు లీడర్గా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో “జాతీయ విద్యా విధానం 2020- కామర్స్ బిజినెస్ ఎడ్యుకేషన్ దృక్పథాలు” అనే అంశంపై గురువారం జరిగిన నేషనల్ వెబినార్లో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆత్మ నిర్భర్ భారత్గా ఎదగాలంటే ఉన్నత విద్యా వ్యవస్థలో ఉత్కృష్టత, విద్యార్థులలో నైపుణ్యాలు అవసరమని అన్నారు. అభివృద్ధి, సుస్థిరతకు ఆవిష్కరణలు కీలకమన్నారు. యూనివర్సిటీలు పరిశోధనలను, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వి.వెంకటరమణ, తెలంగాణ కామర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, కేరళ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ వెంకటేశ్వర్లు, వెబినార్ కన్వీనర్, ఓయూ కామర్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ డి.చెన్నప్ప ప్రసంగించారు. వెబినార్లో దేశ వ్యాప్తంగా దాదాపు వెయ్యి మంది కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాలకు చెందిన విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు పాల్గొన్నారు.