సిటీబ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రభుత్వ కొలువుల జాతర మొదలైంది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వరుస నోటిఫికేషన్లు వెలువడుతున్న కొద్దీ నిరుద్యోగ అభ్యర్థుల్లో ఆశలు పెరిగిపోతున్నాయి. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న కసితో పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.
ఉదయం నుంచే బారులు
ముందు వచ్చిన వారికే తొలి ప్రాధాన్యత ఇస్తుండటంతో ఉదయం తొమ్మిది గంటలకే ఓయూ లైబ్రరీకి విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ప్రస్తుతం గ్రూప్-1 ప్రాథమిక పరీక్షలు, సబ్ ఇన్స్పెక్టర్ కోసం పీఈటీ పరీక్షలు పూర్తికాగా.. మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ కోసం రాత పరీక్షలు నిర్వహించనున్నారు. దీంతో ఎలాగైనా ఉద్యోగం సాధించాలన్న ధృడ సంకల్పంతో విద్యార్థులు రాత్రింబవళ్లు పుస్తకాలతోనే గడిపేస్తున్నారు.
గ్రంథాలయాల్లోనూ అన్ని రకాల పుస్తకాలు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం వరుసగా నోటిఫికేషన్లు విడుదలైన క్రమంలో ప్రైవేటు కోచింగ్ కేంద్రాలలో కూడా శిక్షణ పొందడానికి యువత ఆసక్తి చూపుతున్నారు. సబ్జెక్టు నిపుణులను ఎంపిక చేసుకొని శిక్షణ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అశోక్నగర్, దిల్షుక్నగర్, కూకట్పల్లి, అమీర్పేట్, తదితర ప్రాంతాల్లోని కోచింగ్ సెంటర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలాగే ప్రజా గ్రంథాలయాలు, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, జిల్లా లైబ్రేరీలు కూడా కిటకిటలాడుతున్నాయి. ఆయా లైబ్రెరీలలో కూడా పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని రకాల రిఫరెన్స్ పుస్తకాలను అందుబాటులో ఉంచినట్లు గ్రంథాలయ సంస్థ అధికారులు తెలిపారు. ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3తో పాటు గ్రూప్-4, ఎస్ఐ, కానిస్టేబుల్, టీచర్స్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్స్ వంటి అన్ని పోస్టులకు సంబంధించి జనరల్ స్టడీస్, కరెంట్ ఎఫైర్స్, సబ్జెక్టు పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.
శిక్షణకు పోటీ పడుతున్న యువత
పోటీపరీక్షలకు సంబంధించి ప్రభుత్వ (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ) సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టడీ సర్కిళ్లలో ఉచిత శిక్షణ పొందడానికి నిరుద్యోగ యువత పోటీ పడుతున్నారు. కోచింగ్ పొందడానికి ఎంపికైన యువతకు ఉచితంగా వసతి సౌకర్యంతో పాటు భోజన సదుపాయం కూడా కల్పిస్తున్నారు.