మియాపూర్ , డిసెంబర్ 28 : తెలంగాణలో ట్రాన్స్జెండర్ల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో అందిస్తున్న ఉచిత శిక్షణ రెండో బ్యాచ్ విజయవంతంగా పూర్తి చేసుకున్నది. ఈ మేరకు ఈ నెల 30న అభ్యాసకులైన ట్రాన్స్జెండర్లకు ప్రభుత్వం తరఫున శిక్షణ ధ్రువ పత్రాలతో పాటు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ. 9 వేల చొప్పున అందించనున్నారు. ఈ కార్యక్రమాన్ని శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలోని దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సమాజంలో బతుకుదెరువు కోసం ట్రాన్స్జెండర్లు నానా ఇబ్బందులు పడుతూ కుటుంబ పోషణ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో వారి స్వయం ఉపాధికి ప్రభుత్వం పటిష్ట చర్యలను ప్రారంభించింది. ఈ మేరకు ట్రాన్స్ ఉమెన్స్ సొసైటీ తోడ్పాటుతో ఆల్విన్ కాలనీ డివిజన్లో ఉన్న దుర్గాబాయి మహిళా ప్రాంగణంలో ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకంగా జ్యూట్ బ్యాగుల తయారీలో 45 రోజుల పాటు ఉచిత శిక్షణ అందించింది. పలు ప్రభుత్వ విభాగాల నుంచి వివిధ సైజుల జ్యూట్ బ్యాగులపై ఆర్డర్లు సంపాదించిన కేంద్రం అధికారులు.. శిక్షణ పొందుతున్న ట్రాన్స్జెండర్లతో వాటిని తయారు చేయించారు. అవి మార్కెట్లో మంచి ఆదరణ పొందాయి. త్వరలో మూడో బ్యాచ్ను ప్రారంభించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ యోచిస్తున్నది.
సమాజంలో బతుకు దెరువు లేక మాలాంటి వాళ్లు కుటుంబ పోషణ కష్టమై ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆదుకునేందుకు, గౌరవ ప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాన్ని తీసుకువచ్చింది. సద్వినియోగం చేసుకున్నాం. శిక్షణ అనంతరం జ్యూట్ బ్యాగుల తయారీనే జీవనోపాధిగా మలుచుకుని మా సత్తా నిరూపిస్తాం. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు.
– ప్రేమకుమారి, అభ్యాసకురాలు
ఉపాధి లేక వేరే మార్గం లేక చాలా మంది ట్రాన్స్జెండర్లు సంపాదన కోసం ఇబ్బందికర దారులను అనుసంరించాల్సి వస్తుంది. ప్రభుత్వం కల్పించిన ఈ శిక్షణ గురించి ట్రాన్స్విమెన్ సొసైటీ, పత్రిక ద్వారా తెలుసుకుని శిక్షణలో చేరా. శిక్షణలో నేర్పిన మెలకువలన్నింటినీ శ్రద్ధగా నేర్చుకున్నా. ఇప్పుడు స్వయంగా బ్యాగులను సైతం కుడుతున్నా. నాలాంటి వారికి శిక్షణ గురించి చెప్పి సద్వినియోగం చేసుకునేలా కృషి చేస్తా.
– చందన, అభ్యాసకురాలు
మహిళా శిశు అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ట్రాన్స్జెండర్లకు జ్యూట్ బ్యాగుల తయారీలో ఉచితంగా శిక్షణ అందించాం. శిక్షణలో భాగంగా పలు ప్రభుత్వ సంస్థల నుంచి బ్యాగుల తయారీకి వచ్చిన ఆర్డర్లను సైతం వీరితోనే ఉత్పత్తి చేయించి ఉపాధి కూడా కల్పించాం. ఉచిత శిక్షణతో పాటు ప్రోత్సాహకంగా ఒక్కొక్కరికి రూ. 9 వేల చొప్పున ప్రభుత్వం తరపున అందిస్తున్నాం. -లక్ష్మీకుమారి, మేనేజర్, దుర్గాబాయి మహిళా ప్రాంగణం