సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): గోషామహల్లోని పోలీస్ శిక్షణ కేంద్రం పచ్చదనంతో నిండిపోయింది. ప్రణాళికాబద్దంగా ఇక్కడ పచ్చదనాన్ని పెంచుతున్నారు. ప్రతి హారిత హారం కార్యక్రమంలో సుమారు 150 నుంచి 200 మొక్కలు నాటుతున్నారు. నాటిన ప్రతి మొక్కను కంటికి రెప్పలా కాపాడుతున్నారు. పచ్చదనాన్ని పర్యవేక్షించే బాధ్యతను ఎనిమిది మంది హోంగార్డులకు అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్, అదనపు కమిషనర్ చౌహాన్ నాటిన చెట్లు ఏపుగా పెరిగాయి. ఇక్కడ శిక్షణ పొందుతున్న సిబ్బందికి పచ్చదానం ఆహ్లాదాన్ని పంచుతున్నది. దానిమ్మ చెట్లు నిండుగా కాయడంతో తోటను తలపిస్తున్నాయి.
హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటిన సమయంలో నాటిన అధికారి పేరున బోర్డును ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడికి సంబంధిత అధికారి వచ్చినప్పుడల్లా మొక్కను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటారు. ఇక్కడి చెట్లకు సమీపంలో ఉన్న మౌంటెడ్ ట్రైనింగ్ సెంటర్(గుర్రాల శిక్షణ కేంద్రం) నుంచి ఎరువులు తెచ్చి వేస్తుంటారు.
పోలీస్ శిక్షణ కేంద్రం పరిసరాల్లో ఉన్న అనువైన స్థలంలో ప్రతి యేడు మొక్కలు నాటుతున్నాం. వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. మొక్కలు నాటి.. ఫొటోలు తీసుకోవడం వరకే పరిమితం కావద్దు. మొక్కలు నాటిన తరువాత వాటి ఎదుగుదలకు ఏమి కావాలో పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి. – నగర అదనపు సీపీ, చౌహాన్